గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఎల్జీ పాలిమర్స్ స్పందన ... క్షమాపణ చెప్పి, బాధితులకు అండగా ఉంటామని ప్రకటన
విశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన దుర్ఘటనలో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదానికి కారణమైన గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రజలకు క్షమాపణ చెప్పింది. అంతేకాదు గ్యాస్ ను అదుపులోకి తీసుకురావటానికి , అలాగే ఈ సంఘటనతో బాధపడుతున్న ప్రజలు, వారి కుటుంబాలకు అండగా నిలబడేందుకు అన్నివిధాల సహకరిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది.

గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన ఎల్జీ పాలిమర్స్ సంస్థ
ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటనపై దక్షిణ కొరియా స్పందించింది. విశాఖ ఘటన తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఢిల్లీలో ఉన్న కొరియన్ దౌత్యవేత్త షిన్బాంగ్ కిల్ అన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. గ్యాస్ లీకేజీతో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.బాధితులందరికీ అవసరమైన వైద్య సహాయం అందజేసేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు.

బాధితుల ఆరోగ్య భద్రత తమదేనని పేర్కొన్న సంస్థ .. వారి కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
సంస్థలో పని చేసే ఉద్యోగులు, సమీప గ్రామాల బాధితుల ఆరోగ్య భద్రత తమదేనని పేర్కొన్నారు . ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుండి అకస్మాత్తుగా వెలువడిన విషవాయువు ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వంతో కలిసి తమ బృందాలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయని ఎల్జీ సంస్థ పేర్కొంది. బాధితులు, మరణించిన వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసినట్టు ఎల్జీ పాలిమర్స్ వెల్లడించింది.ఇక స్థానిక ప్రజల రక్షణ కోసం వెంటనే అమలు చేయగల సమర్థవంతమైన సంరక్షణ ప్యాకేజీని అందించడానికి కూడా తాము చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది . ఇక అక్కడి స్థానికులకు దోహదపడేలా మధ్య, దీర్ఘకాలిక సపోర్టింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్టు తెలిపింది.

దర్యాప్తుకు సహకరిస్తాం .. ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్న సంస్థ
ఇక ఇప్పటికే ఈ సంస్థపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇక ఏపీ ప్రభుత్వం సమగ్ర విచారణకు హైపవర్ కమిటీని నియమించింది . ఈ ఘటనపై ప్రభుత్వం చేసే దర్యాప్తునకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు. ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఇక ఒకపక్క జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ , పొల్యూషన్ బోర్డు , ఏపీ హై కోర్టు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నాయి.












Click it and Unblock the Notifications