చిలకా గోరింకల్లా- చూడముచ్చటగా..!!
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్పై ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటు విమర్శలు సంధించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి ప్రయోజనాలను కాపాడటానికే వారిద్దరూ తాపత్రయ పడుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి రావడం కంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికే నాదెండ్ల మనోహర్ సహకారంతో పవన్ కల్యాణ్ విస్తృత ప్రచారం చేస్తోన్నారని ధ్వజమెత్తారు.

అమరావతి గుర్తుకు రాలేదా?
విశాఖపట్నం రుషికొండను తవ్వేస్తోన్నారంటూ పవన్ కల్యాణ్ చేస్తోన్న విమర్శల్లో అర్థం లేదని గుడివాడ అమర్నాథ్ అన్నారు. గతంలో అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ఏకంగా 33 వేల ఎకరాలను పంట పొలాలను ధ్వంసం చేస్తే పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. రాజధాని నిర్మాణం పేరుతో ఇన్ని వేళ ఎకరాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు సంస్థల చేతుల్లోకి పెట్టిందనే విషయం పవన్ కల్యాణ్కు తెలియదా అని ప్రశ్నించారు.

మోదీ సభ నుంచి..
పవన్ కల్యాణ్ రుషికొండను సందర్శించడాన్ని తప్పు పట్టారు గుడివాడ అమర్నాథ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన సభ అంచనాలకు మించి విజయవంతమైందని, దీని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే పవన్ కల్యాణ్- రుషికొండను సందర్శించారని ఆరోపించారు. లక్షలాది మంది ప్రజలు హాజరైన సభను పక్కదారి పట్టించడానికి చంద్రబాబు చెప్పినట్టుగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తోన్నారని స్పష్టం చేశారు.

బీచ్ వాక్..
పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరూ కలిసి విశాఖపట్నం బీచ్ను సందర్శించడం పట్ల గుడివాడ అమర్నాథ్ స్పందించారు. వారిద్దరూ చిలక గోరింకల్లా కనిపించారని ఎద్దేవా చేశారు. చిలక గోరింక కలిసి బీచ్ వాక్కు వెళ్లాయని వ్యాఖ్యానించారు. ప్రేమ పావురాల్లా బీచ్ వాక్ చేస్తే బాగుండదు గనక- రుషికొండను కూడా సందర్శించి రాజకీయ నాయకులం అనిపించుకోవాలనేది వారి ఉద్దేశమని మంత్రి అమర్నాథ్ చురకలు అంటించారు.

మరొకరు ఉన్నారా?
జనసేన పార్టీలో పవన్ కల్యాణ్- నాదెండ్ల మనోహర్ మినహా మరో నాయకుడు ఉన్నాడా? అని ఆయన ప్రశ్నించారు. ఆ రాజకీయ పార్టీలో వారిద్దరూ మినహా మరెవరు ఉన్నారని చెప్పారు. ఏ వేదిక ఎక్కినా పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ మాత్రమే కనిపిస్తారని, వారిద్దరు తప్పితే ఇంకెవరూ లేరని అన్నారు. నరేంద్ర మోదీని గానీ, చంద్రబాబును గానీ కలిసిన వారిద్దరే ఉంటారని గుర్తు చేశారు. బీచ్ వాక్లో గానీ, భోజన సమయంలో గానీ వారిద్దరే ఉంటారని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ను నాదెండ్ల మనోహరే బంగాళాఖాతంలో కలిపేస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications