48 గంటల్లో..: ఏపీ ప్రభుత్వానికి పవన్ అల్టిమేటం: చిన్న బ్రేక్ తరువాత మళ్లీ విశాఖకు
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోసారి విశాఖపట్నంలో అడుగుపెట్టారు. మొన్నటివరకూ వారాహి యాత్రలో ఉన్న ఆయన చిన్న బ్రేక్ ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి మంగళగిరికి వెళ్లారు. ఈ సాయంత్రం ఆయన మళ్లీ విశాఖపట్నానికి వచ్చారు.
జిల్లాలోని భీమిలీ సమీపంలో గల ప్రఖ్యాత ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు పవన్ కల్యాణ్. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఎర్రమట్టి దిబ్బలను దోచుకుంటోన్నారనేది ఆయన ఆరోపణ. ఈ నేపథ్యంలో- వాటిని పరిశీలించారు. ఆ సమయంలో ఆయన వెంట జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, జిల్లా నేత డాక్టర్ పంచకర్ల సందీప్ తదితరులు ఉన్నారు.

అనంతరం అక్కడే విలేకరులతో మాట్లాడారు పవన్ కల్యాణ్. ఎర్రమట్టి దిబ్బలు వారసత్వ సంపదగా వస్తోన్నాయని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని అన్నారు. వాటిని పరిరక్షించే విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
సుమారు 1,200 ఎకరాల్లో ఉండే ఈ ఎర్రమట్టి దిబ్బలు.. ఆక్రమణలు, దోపిడీకి గురయ్యాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇప్పుడు 292 ఎకరాలే మిగిలాయని, ఈ జాతీయ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పారు. ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతాల్లో బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
దీనిపై ప్రభుత్వం 48 గంటల్లో చర్యలు ప్రారంభించాలని, లేదంటే దీనిపై ఉద్యమిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఎర్రమట్టి దిబ్బలు అత్యంత సహజ సిద్దంగా ఏర్పాడ్డాయని గుర్తు చేశారు. వాటిని పరిరక్షించే విషయంలో వైసీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం కనికరం లేదని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయని, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు.
ఎర్రమట్టి దిబ్బలపై పర్యావరణ ప్రేమికులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. వాటి సమీపంలో ఇసుకను తవ్వాల్సిన అవసరం విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి అథారిటీకి ఏం అవసరం ఉందని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ దీనిపై దృష్టి సారించాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అన్యాక్రాంతమౌతున్నాయని ఆరోపించారు.












Click it and Unblock the Notifications