విశాఖలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు- ఆందోళనలో జగన్ సర్కార్...
విశాఖపట్నం జిల్లాలో గత నెల రోజుల్లో కరోనా వైరస్ ప్రభావాన్ని దాదాపుగా తగ్గించడంలో విజయవంతమైన ప్రభుత్వం.. తాజాగా నమోదవుతున్నకేసులతో ఆందోళన చెందుతోంది. 24 గంటల్లో ఆరు కేసులు నమోదు కావడంతో మొత్తం ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35కు చేరుకుంది. ఇందులో ఇప్పటికే 20 మంది చికిత్స తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు కాగా..
మిగతా 15 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఉన్నారు. వీరిలో ఆరుగురు గత 24 గంటల్లో ఆస్పత్రులకు వచ్చిన వారే. అంటే నిన్నటి వరకూ కేవలం 9 మంది మాత్రమే జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితులుగా ఉన్నారు.
వాస్తవానికి గత నెలలో 15 రోజుల పాటు విశాఖలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ప్రభుత్వం రాజధాని తరలింపు కోసమే జిల్లాలో కేసుల సంఖ్యను దాచిపెడుతోందంటూ టీడీపీ నేతలు విమర్శలకు దిగారు. అదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ నేతలతో కలిసి నగరంలో విస్తృతంగా పర్యటించడం వివాదానికి ఆజ్యం పోసింది. అయితే అప్పటి వరకూ కేసుల సంఖ్యలో పెరుగుదల లేకపోయినా ఆ తర్వాత ఒక్కసారిగా కేసులు పెరగడం మొదలుపెట్టాయి.

ఈ సంఖ్య తాజాగా 35కు చేరింది. అయితే ఆస్పత్రుల్లో ఉన్న 15 మంది డిశ్చార్జ్ అయితే ఇక సమస్యలు ఉండబోవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరులోగా సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు మారుస్తారన్న వార్తల నేపథ్యంలో విశాఖలో కరోనా కేసులు ఇప్పుడు రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.












Click it and Unblock the Notifications