గ్యాస్ లీక్ భయాలు- శ్రీకాకుళానికి విశాఖ జనం- అడ్డుకున్న పోలీసులు..
విశాఖపట్నంలోని ఆర్.ఆర్. వెంకటాపురం వద్ద ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోవడం, వందలాది మంది బాధితులుగా మారిన నేపథ్యంలో నగర వాసులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. వీరిలో కొందరు ఉత్తరాంధ్రలోని వేర్వేరు ప్రాంతాలకు పయనమవుతున్నారు. ఉదయం పూట షాపింగ్ కోసం లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన సమయంలో వీరంతా బైక్ లు, కార్లలో ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు తరలిపోతున్నారు. వీరిలో కొందరిని పోలీసులు శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం వద్ద అడ్డుకోవడంతో ఈ విషయం తెలిసింది.
పదవి పోతుందని తెలిసినా జగన్ విశాఖ వెళ్లారా ? పీవీపీ ట్వీట్ సంచలనం- గతంలో ఎన్టీఆర్ కు ఏమైంది ?
ప్రస్తుతం విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ కరోనా వైరస్ కేసులు ఉన్నాయి. దీంతో ఈ మూడు జిల్లాల్లోనూ లాక్ డౌన్ కొనసాగుతోంది. అయినా జనం విశాఖ గ్యాస్ లీక్ భయాలతో నగరం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వీరిని అడ్డుకుంటున్న పోలీసులు తిరిగి విశాఖకు పంపుతున్నారు. వెళ్లని వారిని క్వారంటైన్ కు పంపుతామని హెచ్చరికలు చేస్తుంటడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో వీరు విశాఖ వెళ్తున్నారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ తర్వాత కూడా మరోసారి భారీగా గ్యాస్ లీకైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో ప్రస్తుతం విశాఖ జిల్లా వ్యాప్తంగా ఈ వదంతులు మరింత తీవ్రంగా వ్యాపించాయి.