గంటా శ్రీనివాస్ మళ్లీ రాజీనామా: వారంలో రెండోసారి: ఈ సారి ఆమోదం పొందేలా
విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు రాజీనామా చేశారు. తన పదవికి ఆయన రాజీనామా చేయడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. ఇదివరకు ఆయన రాజీనామా చేసినప్పటికీ.. దానిపై అనుమానాలు, విమర్శలు తలెత్తాయి. దీనితో ఈ సారి స్పీకర్ ఫార్మట్లో రాజీనామా చేశారు.
విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న గంటా శ్రీనివాస రావు తీసుకున్న తాజా నిర్ణయం ఫలితంగా- గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇతర టీడీపీ ఎమ్మెల్యేలపై రాజీనామాల ఒత్తిడి పెరిగినట్టయింది. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో భాగంగా.. వామపక్ష అనుబంధ కార్మిక సంఘాలు కూర్మన్నపాలెం గేటు వద్ద రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నాయి. దీనికి మద్దతుగా ఈ ఉదయం జర్నలిస్టుల ఫోరం ప్రతినిధులు దీక్షా శిబిరంలో బైఠాయించారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ నినదించారు. వారి ఆందోళనలు, నిరసన దీక్షలకు గంటా శ్రీనివాస రావు సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ ఉదయం ఆయన దీక్షా శిబిరానికి చేరుకున్నారు. కోట్లాదిమంది ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే ప్రతిపాదనలకు నిరసనగా తాను మరోసారి రాజీనామా చేశానని తెలిపారు. తన పదవికి రాజీనామా చేస్తున్నానంటూ ఏకవాక్యంగా పేర్కొన్నారు. రాజీనామా పత్రాన్ని జర్నలిస్టుల ఫోరం ప్రతినిధులకు అందజేశారు.
గంటా శ్రీనివాస్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల జీవీఎంసీ పరిధిలో తెలుగుదేశం పార్టీకే చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై పడే అవకాశం లేకపోలేదు. వారు కూడా తమ పదవులకు రాజీనామాలు చేయాలనే ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. విశాఖపట్నం వెస్ట్, ఈస్ట్ ఎమ్మెల్యేలు పీవీజీఆర్ నాయుడు (గణబాబు), వెలగపూడి రామకృష్ణ బాబు రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది కూడా. టీడీపీకే చెందిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇదివరకే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.