గండం గట్టెక్కడానికి అర్జంట్గా ఆ మూడు పనులు చేయండి: వైఎస్ జగన్కు గంటా శ్రీనివాస్ లేఖ
విశాఖపట్నం: ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు నిరసగా తన పదవికి రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు.. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించొద్దంటూ వైఎస్ జగన్.. ప్రధానికి లేఖ రాయడాన్ని స్వాగతించిన ఆయన మరో సూచన చేశారు. అత్యవసరంగా మంత్రివర్గాన్ని, అసెంబ్లీని సమావేశపర్చాలని సూచించారు.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించడానికి నిరసనగా ఓ తీర్మానాన్ని చేయాలనే ఏకైక అజెండాతో అత్యవసర అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని గంట శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించడాన్ని తాము అంగీకరించబోవట్లేదంటూ అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకుని, కేంద్రానికి పంపించాలని చెప్పారు. అలాగే- వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరించాలనే ప్రతిపాదనలను తాము గట్టిగా వ్యతిరేకిస్తున్నామనే సందేశాన్ని కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.
ఈ దిశగా అత్యవసర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి, ఓ తీర్మానాన్ని ఆమోదించాలని అన్నారు. అలాగే- అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించడానికి అఖిలపక్షాన్ని అత్యవసరంగా పిలవాలని చెప్పారు. ఈ మూడు పనులు చేయడం ద్వారా.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకంగా ఉన్నామని కేంద్రానికి తెలియజేయాలని గంటా శ్రీనివాస్ చెప్పారు. ప్రత్యక్షంగా 17 వేల మందికి పైగా ఉద్యోగులు.. పరోక్షంగా లక్ష మంది విశాఖ స్టీల్ ప్లాంట్పై ఆధారపడి ఉన్నారనే విషయాన్ని విస్మరించవద్దని అన్నారు.