మూడు రాజధానుల రగడ ..వైసీపీ నేతలు మూర్ఖులన్న మాజీ ఎంపీ సబ్బంహరి
ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానుల ప్రకటనపై వెల్లువెత్తుతున్న నిరసనలు ఉధృతం అవుతున్నాయి. రాజధాని రైతుల పోరాటం ఉగ్ర రూపం దాలుస్తుంది. మూడు రాజధానుల ప్రకటనపై మొదట్లో మెజార్టీ ప్రజల నుండి హర్షం వ్యక్తం కాగా ఇప్పుడు నిరసన వ్యక్తం అవుతుంది. మూడు రాజధానుల ప్రకటనపై మాజీ ఎంపీ సబ్బం హరి తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ ప్రకటన మోసపూరితం అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు వైసీపీ నేతలు మూర్ఖులు..ఎవరు ఏం చెప్పినా వినరని ఘాటుగా వ్యాఖ్యానించారు.

రాజకీయ కక్ష సాధింపుల కోసమే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని సబ్బంహరి ఫైర్
రాజకీయ కక్షసాధింపుల కోసం రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని సబ్బంహరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే వ్యాఖ్యలు అవాస్తవం అని సబ్బం హరి పేర్కొన్నారు. కావాలని వైసీపీ ఇదంతా చేస్తుందన్న సబ్బంహరి విశాఖను నాశనం చెయ్యొద్దని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిణామాలను చూసి చాలా బాధపడుతున్నానని అన్నారు. అభివృద్ధి పనులను పక్కన పెట్టి మంత్రులు పూటకో అబద్ధం చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని సబ్బంహరి విమర్శించారు.

జగన్ అమరావతి నిర్మాణాన్ని కావాలనే ఆడుకున్నారని విమర్శలు
కావాలని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకున్నారని, జగన్ ఏడు నెలలుగా పనిచేసి ఉంటే అమరావతిలో ఇప్పటికే భవనాలన్నీ పూర్తయ్యేవని సబ్బంహరి అభిప్రాయపడ్డారు. రాజధాని విషయంలో బొత్స సత్యనారాయణతో ముఖాముఖి చర్చించేందుకు తాను సిద్ధం అని సబ్బం హరి ప్రకటించారు. విశాఖ ఉత్సవ్ పేరుతో వచ్చి కేబినెట్ మీటింగ్ పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.జగన్ కు ఏ మాత్రం పాలనలో అవగాహన లేదని ఆయన పేర్కొన్నారు.

జగన్ కు మాట తప్పటం మడమ తిప్పటం అలవాటు అన్న సబ్బంహరి
ఏడు నెలల కాలంలో ఎన్ని కంపెనీలు తెచ్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని హరి డిమాండ్ చేశారు. జగన్ మాట తప్పని రోజు లేదు అని విమర్శించిన సబ్బంహరి మాట తప్పడం, మడమ తిప్పడమే జగన్ పని అని దుయ్యబట్టారు. అన్ని హామీలపైనా జగన్ మాట తప్పుతూనే ఉన్నారని పేర్కొన్నారు. ఇక అసెంబ్లీలో వైసీపీ సభ్యులు వెకిలితనంగా ప్రవర్తించినా, చంద్రబాబు హుందాగా వ్యవహరిస్తున్నారని హరి పేర్కొన్నారు .

అధికారం ఉంటె ఏదైనా చెయ్యొచ్చు అనే భయం లేనివారితో ప్రమాదం
తానుఏనాడూ చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడలేదని, జగన్ కు సాలా సార్లు తన మద్దతు తెలిపానని అయినా జగన్ అవగాహనా రాహిత్యం రాష్ట్రానికి చేటు చేస్తుందని సబ్బంహరి తెలిపారు. ప్రస్తుత తరుణంలో మేధావుల మౌనం చాలా ప్రమాదకరం అన్నారు. అధికారంలో ఉన్నవారికి అసలే భయం లేకపోవటం ప్రజాస్వామ్యానికే పెనుముప్పు అని చెప్పారు. అధికారంలోకి వస్తే ఏదైనా చేయగలమని అనుకుంటున్నారని నేతల తీరును సబ్బంహరి తప్పుపట్టారు. రాష్ట్రంలో ప్రజలపై కులాల ముద్ర వేసి భయపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

నిర్ణయం మార్చుకోకుంటే చరిత్రలో చెడ్డవాడిగా మిగులుతావని జగన్ కు చెప్పిన సబ్బంహరి
అమరావతిని విచ్ఛిన్నం చేయొద్దని సీఎం జగన్కు ఆయన విజ్ఞప్తి చేశారు. జగన్ మనసు మార్చుకొని అమరావతిపై మాటపై నిలబడాలని కోరారు. విచ్ఛిన్నం చేస్తే జగన్ చరిత్రలో చెడ్డవాడిగా మిగిలిపోతారని పేర్కొన్నారు. ప్రజల సహనానికి జగన్ పరీక్ష పెట్టొద్దన్నారు. ఏపీకి ప్రణాళికాబద్ధమైన నగరం కావాలి కానీ మూడు రాజధానులు అవసరం లేదన్న సబ్బం హరి జగన్ తీసుకున్న నిర్ణయం తప్పని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications