Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ ఏజెన్సీ వాసుల పురిటి కష్టాలు ; గర్భిణీలను డోలీలో ఆస్పత్రులకు, గిరిజనుల ప్రాణాలు గాల్లో దీపాలేనా ?

శాస్త్ర సాంకేతిక రంగాలలోనే కాదు, ఆధునికంగా అన్ని విషయాల్లోనూ ప్రగతి సాధించామని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ నేటికీ మారుమూల గిరిజన ప్రాంతాలలో ప్రజలు పడుతున్న కష్టాలను చూస్తే, ఇదేనా మనం సాధించిన ప్రగతి, ఇదేనా మన అభ్యున్నతి అని అనిపించక మానదు. ప్రపంచమే మారినా, మారుమూల గిరిజన గ్రామాలలో పరిస్థితులు మాత్రం మారడం లేదు. అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న అడవి బిడ్డల బ్రతుకులు మారటం లేదు. అడవి బిడ్డలు అడుగడుగున అగచాట్లు పడుతున్నారు. తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీలో చోటు చేసుకున్న సంఘటన అడవిబిడ్డల కష్టాలకు అద్దం పడుతుంది.టెక్నాలజీలో దూసుకుపోతున్నా అడవిబిడ్డలకు కనీస వైద్య సదుపాయాలు కల్పించటంలో వెనుకబడుతున్నామన్న భావన కలిగిస్తుంది. తరాలు మారినా, యుగాలు గడిచినా వీళ్ళ బ్రతుకులింతేనా అని అందరూ ఆలోచించేలా చేస్తుంది.

 మౌలిక సదుపాయాలు లేక ఏజెన్సీ వాసులకు నిత్య నరకం

మౌలిక సదుపాయాలు లేక ఏజెన్సీ వాసులకు నిత్య నరకం

విశాఖ ఏజెన్సీలో నేటికి సరైన సదుపాయాలు లేక, కనీస మౌలిక వసతులు లేక ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. ఇక గర్భిణీ మహిళల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారయింది. గర్భిణీ మహిళలకు పురిటి నొప్పులు వస్తే, వారిని ఆసుపత్రికి తరలించడానికి కూడా రోడ్డు మార్గం లేని పరిస్థితి. దీంతో గర్భిణీ మహిళలను డోలీ కట్టి అందులో ఆస్పత్రి వరకు కాలినడకన మోసుకు వెళ్తున్నారు. అదృష్టం బాగుంటే బిడ్డ, తల్లి క్షేమంగా తిరిగి వస్తారు. లేదంటే ఆ కుటుంబాలలో విషాదమే.

 గర్భిణీ మహిళకు పురిటినొప్పులు .. డోలీ కట్టి 20 కిలోమీటర్ల కాలినడకన ఆస్పత్రికి

గర్భిణీ మహిళకు పురిటినొప్పులు .. డోలీ కట్టి 20 కిలోమీటర్ల కాలినడకన ఆస్పత్రికి

తాజాగా పురిటి నొప్పులతో బాధపడుతున్న ఒక మహిళను డోలీలో మోసుకుంటూ 20 కిలోమీటర్ల మేర నడిచి డెలివరీ కోసం ఆస్పత్రికి తరలించిన ఘటన ఏజెన్సీ వాసుల కష్టాలకు అద్దం పడుతుంది. విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి మండలం బలపం పంచాయతీ మారుమూల గ్రామమైన తోకపాడులో కుసంగి చంద్రమ్మ అనే నిండు గర్భిణీకి నొప్పులు రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే రోడ్డు మార్గం కూడా లేకపోవడంతో డోలీ కట్టి, డోలీలో గర్భిణీ మహిళను పడుకోబెట్టి 20 కిలోమీటర్ల మేర మోస్తూ నడుచుకుంటూ ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.

నిన్న బయలుదేరి నేడు ఉదయం ఆస్పత్రికి చేరుకున్న అడవి బిడ్డలు

నిన్న బయలుదేరి నేడు ఉదయం ఆస్పత్రికి చేరుకున్న అడవి బిడ్డలు

మహిళ కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో, ఎత్తైన కొండ ప్రాంతంలో అతి కష్టం మీద ఎన్నో అవస్థలను ఓర్చుకుంటూ మహిళను ఆసుపత్రికి తరలించారు. దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోతుగెడ్డ ప్రైమరీ ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి నిన్న బయలుదేరిన వారు ఈ రోజు ఉదయానికి ఆసుపత్రికి చేరుకున్నారు. ఏజెన్సీలో రోడ్లు లేక, అంబులెన్సులు వచ్చే దారి లేక అనారోగ్యం బారిన పడినా ఆసుపత్రికి రాలేక గిరిజనం ఇబ్బంది పడుతున్నారు. ఇక డెలివరీ వంటి అత్యవసర సమయాల్లో తీవ్ర వ్యయ ప్రయాసలకోర్చి వారు ఆసుపత్రులకు వెళుతున్నారు. చంద్రమ్మ ఆస్పత్రికి చేరేవరకు సురక్షితంగానే ఉంది. కానీ ఎందరో గర్భిణీలు మార్గ మధ్యలోనే తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.

సీజనల్ ఫీవర్స్ తోనూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న గిరిజనం

సీజనల్ ఫీవర్స్ తోనూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న గిరిజనం

ఇక వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలినా, విపరీతమైన అనారోగ్యంతో బాధ పడినా సరే ఆస్పత్రులకు వెళ్ళలేక చాలా మంది గిరిజనులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అడవిలో ప్రకృతి ఒడిలో జీవనం సాగించే వీరికి సీజనల్ వ్యాధులతోనూ ప్రమాదం పొంచి ఉంది. అలా సీజనల్ వ్యాదుల దెబ్బకు ప్రాణాలు కోల్పోయిన అడవిబిడ్డలు ఎందరో. వర్షాకాలం వచ్చిందంటే చాలు ముందు మంచం ఎక్కేది మారుమూల ఉన్న గిరిజన గ్రామాలే. ఓటర్లుగా వీరికి గుర్తింపు ఉన్నా, అన్ని విషయాల్లోనూ వీరు అభివృద్ధికి ఆమడ దూరంలో జీవనం సాగిస్తున్నారు. కేవలం ఓట్ల కోసమే ప్రజా ప్రతినిధులు వీళ్ళ దగ్గరకు వెళ్లి వస్తున్నారు తప్ప వీరి సమస్యల పరిష్కారానికి ఏ మాత్రం శ్రద్ద పెట్టటం లేదు.

కనీస వసతులు కల్పించాలని అడవి బిడ్డల విజ్ఞప్తి

కనీస వసతులు కల్పించాలని అడవి బిడ్డల విజ్ఞప్తి

పాలకులు, అధికారులు ఇప్పటికైనా తమ గోడు అర్థం చేసుకోవాలని, ఏజెన్సీ వాసులు కోరుతున్నారు. తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని వారు అడుగుతున్నారు. అయితే అటవీ ప్రాంతాలలో జీవనం సాగించే వీరికి, అడవులలో రోడ్డు మార్గాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి ఉన్న పెద్ద ఇబ్బంది. అటవీ ప్రాంతాలను వదిలి వీరు జీవించలేరు. వీరు ఉన్నచోటికి ప్రభుత్వం రోడ్డు మార్గాలను ఏర్పాటు చేయలేదు. దీంతో ఏజెన్సీ వాసుల కష్టాలు ఎంతోకాలంగా ఇలాగే కొనసాగుతున్నాయి. మారుమూల గిరిజన గ్రామాలు కరెంటు లేక, త్రాగు నీరు లేక, చదువుకునేందుకు స్కూల్స్ లేక, వైద్యాన్ని అందించే ఆసుపత్రులు లేక, కనీస రోడ్డు సౌకర్యం లేక తల్లడిల్లుతున్నాయి.

అనాదిగా గిరిజనుల ప్రాణాలు గాల్లో దీపాలు

అనాదిగా గిరిజనుల ప్రాణాలు గాల్లో దీపాలు

నిత్యం అమాయక గిరిజనులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా పట్టించుకున్న నాథుడు లేడు. ఏజెన్సీ పరిధిలోని గిరిజన గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు అవుతున్నా, కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించని పరిస్థితి . దీంతో గిరిజనుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి. విశాఖ ఏజెన్సీనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన గ్రామాలలో చాలావరకు ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు మారడానికి వారికి కనీస వైద్య సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

టెక్నాలజీలో దూసుకుపోతున్నా అడవిబిడ్డలకు కనీస వైద్య సదుపాయాలు కల్పించటంలో వెనుకబడుతున్నామన్న భావన కలిగిస్తుంది. తరాలు మారినా, యుగాలు గడిచినా వీళ్ళ బ్రతుకులింతేనా అని అందరూ ఆలోచించేలా చేస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+