విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కానివ్వబోం .. ఢిల్లీ కార్మికుల మహాధర్నాలో సాయిరెడ్డి స్పష్టం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు కార్యాచరణ సమితి నేతృత్వంలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, ఉద్యోగ సంఘాల నాయకులు, పలు ప్రజా సంఘాలు, విపక్ష పార్టీల నాయకులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్రానికి వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కానివ్వబోమన్న వైసీపీ ఎంపీ సాయిరెడ్డి
కార్మికులు చేస్తున్న ఆందోళనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మద్దతు పలికారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కార్మికులు చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవివి సత్యనారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కానివ్వబోమని స్పష్టం చేశారు. ఎన్నో పోరాటాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందని, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎంతో చరిత్ర ఉందని ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒప్పుకోకూడదని స్పష్టం
1991లో ఉత్పత్తి మొదలు పెట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతి పెద్ద ఉక్కు కర్మాగారంగా అవతరించిందని గుర్తు చేశారు. 15 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, 17 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 70 వేల మంది కార్మికులు పరోక్షంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవిస్తున్నారని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి ఎటువంటి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒప్పుకోకూడదని స్పష్టం చేశారు.

రాజకీయాలకు అతీతంగా పోరాటం చెయ్యాలన్న సాయిరెడ్డి
రాజకీయాలకు అతీతంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మనమంతా పోరాటం చేద్దామని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మీతో కలిసి ముందుకు నడుస్తానని విజయసాయి రెడ్డి కార్మిక లోకానికి భరోసా ఇచ్చారు. ప్రైవేటీకరణ చేయకుండా పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఎన్నో ప్రాణాలను కాపాడింది అని గుర్తు చేసిన విజయసాయిరెడ్డి ఇప్పటికీ నెలకు రెండు వందల కోట్ల రూపాయల లాభంతో ఉక్కు పరిశ్రమ నడుస్తోందని స్పష్టం చేశారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం
నష్టాలలో ఉన్న సంస్థను ప్రైవేటీకరణ చేయడం బిజెపి ప్రభుత్వ విధానాల్లో ఒకటని, కానీ విశాఖ ఉక్కు కర్మాగారం లాభాల్లోనే ఉందని, మధ్యలో కొంతకాలం నష్టాలు వచ్చినప్పటికీ, మళ్లీ లాభాల బాటలో పయనిస్తోంది అని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ ఎంపీ డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి జగన్ లేఖ రాశారని, లేఖలో ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచించారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గుర్తు చేశారు.

జోరున వర్షంలోనూ ఢిల్లీ వేదికగా కార్మికుల ఆందోళన
స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించాలని సీఎం కోరినట్లుగా తెలిపారు. పార్లమెంటులో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించి, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సభను అడ్డుకుంటామని గుర్తుచేశారు విజయసాయిరెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కానివ్వబోమని విజయసాయిరెడ్డి కార్మిక లోకానికి హామీ ఇచ్చారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జోరున కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్క చెయ్యకుండా కార్మికులు ఆందోళన చేస్తున్నారు.












Click it and Unblock the Notifications