జగన్ సర్కార్ పై వాట్సాప్ పోస్టులు-విశాఖలో టీచర్ సస్పెన్షన్-సెక్షన్ 66 రద్దుతో
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఏఫీ సీఐడీ అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయగా.. తాజాగా విశాఖలో వాట్సాప్ లో పోస్టులు పెట్టిన టీచర్ సస్పెన్షన్ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.
విశాఖ జిల్లా నాతవరం మండలం ఉప్పగగూడెం ప్రాథమిక పాఠశాలలో ఎస్ జీ టీగా పనిచేస్తున్న ఎస్. నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్ లో పోస్టులు పెడుతున్నాడు. దీనిపై తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు జరిపిన విశాఖ విద్యాశాఖాధికారి నాయుడును సస్పెండ్ చేస్తూ ఈ నెల 12నే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ నాయుడు వాట్సాప్ లో పోస్టులు ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనపై సర్వీసు నిబంధనల మేరకు సస్పెన్షన్ వేటు వేసినట్లు అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే గతంలో ప్రభుత్వ ఉద్యోగులైనా, సాధారణ ప్రజలైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే సీఐడీ రంగంలోకి దిగి కేసులు నమోదు చేసేది. అప్పట్లో ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ కింద కేసులు పెట్టేవారు.
Recommended Video
తాజాగా సుప్రీంకోర్టు తాము ఎప్పుడో రద్దు చేసిన సెక్షన్ 66ఏ వాడకంపై సీరియస్ కావడంతో ఈ సెక్షన్ కింద పెట్టిన కేసుల్ని ఎత్తేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో విశాఖ టీచర్ పై ప్రభుత్వం శాఖా పరమైన చర్యలతో సరిపెట్టినట్లు తెలుస్తోంది.