స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత .. ఫైనాన్స్ డైరెక్టర్ ఘెరావ్ , పరుగులు తీసిన డైరెక్టర్
పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో విశాఖ నగరంలో కార్మికుల ఆగ్రహావేశాలు వెల్లువెత్తున్నాయి. స్టీల్ సిటీ విశాఖ కేంద్రం నిర్ణయంతో భగ్గుమంటోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.
ఈరోజు విశాఖ ఉక్కు ఉద్యమంలో భాగంగా పరిపాలన భవనాన్ని ముట్టడించిన కార్మికులు ప్లాంట్ లో ఉద్యోగులను ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డుకుంటూ తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఆందోళనకారులు ఒక్కసారిగా డైరెక్టర్ ను అడ్డుకోవటంతో ఉద్రిక్తత
స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్తున్న ఫైనాన్స్ డైరెక్టర్ కారును పరిరక్షణ పోరాట కమిటీ ఆందోళనకారులు అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన కార్మికులు ప్లాంట్ లోకి వెళ్ళడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు . లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఫైనాన్స్ అధికారి కారును అడ్డుకుని డైరెక్టర్ ను ఘెరావ్ చేశారు.
పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఒక్కసారిగా డైరెక్టర్ ను అడ్డుకోవటంతో స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

పరుగులు తీసిన ఫైనాన్స్ డైరెక్టర్ వేణుగోపాల్
ఫైనాన్స్ డైరెక్టర్ ను ఉద్యమకారులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది డైరెక్టర్ ను అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆందోళనకారులు ఫైనాన్స్ డైరెక్టర్ వెనక పరుగులు తీసి, ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక ఆందోళన కారుల ఆగ్రహావేశాలను చూసిన ఫైనాన్స్ డైరెక్టర్ వేణుగోపాల్ అక్కడి నుండి పరుగులు తీశారు.
మరోవైపు విశాఖలో ఉదృతంగా కొనసాగుతున్న నిరసనల హోరుతో పాటు రహదారుల దిగ్బంధం చాలా చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది.

ఎక్కడికక్కడ నిలిచిన ట్రాఫిక్ .. దారి మళ్లిస్తున్న పోలీసులు
దీంతో పోలీసులు ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. తుని వైపు వెళ్లాల్సిన వాహనాల్లో లంకెలపాలెం నుంచి, సబ్బవరం మీదుగా మళ్లిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను ఎన్ఏడి జంక్షన్ పెందుర్తి మీదుగా మళ్లిస్తున్నారు. ఆందోళనల వల్ల ఎన్ఏడి నుంచి కూర్మన్నపాలెం వరకు అనకాపల్లి నుంచి లంకెలపాలెం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది . ఇక మరోవైపు నిన్న రాత్రి నిర్మలాసీతారామన్ ప్రకటన తర్వాత నుంచి ప్రారంభమైన ఆందోళన కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద కొనసాగుతూనే ఉంది .

జాతీయ రహదారిపైనా కొనసాగుతున్న ఆందోళన .. భారీగా పోలీసుల మోహరింపు
జాతీయ రహదారిని కార్మికుల దిగ్బంధించి ఆందోళన చేపట్టడంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళనలు అదుపుచేయడం, ట్రాఫిక్ ను దారి మళ్ళించడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. మొత్తానికి సాగర తీర నగరం విశాఖ కేంద్రం చేసిన ప్రకటనతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆందోళనలతో ఉద్రిక్తంగా మారింది.
ఆందోళనల నేపధ్యంలో భారీగా మోహరించిన పోలీసులు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications