అనూహ్య పరిణామం- ప్రైవేటీకరణ వేళ లాభాల్లోకి వైజాగ్ స్టీల్- కేంద్రానికి సవాల్
దేశవ్యాప్తంగా నష్టాల బాటలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధల్ని ప్రైవేటీకరణ పేరుతో వదిలించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కూడా తెరపైకి వచ్చింది. నష్టాల సాకుతో దశాబ్దాల క్రితం ఎన్నో పోరాటాలతో సాధించుకున్న ఈ ప్లాంట్ను కేంద్రం అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమవుతోంది. అమ్ముడుకాకపోతే మూసేస్తామంటూ హెచ్చరికలు కూడా చేస్తోంది. మరోవైపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జోరుగా ఉద్యమాలు కూడా సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నాలుగు నెలలుగా స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చిందని యాజమాన్యం ప్రకటించింది.
వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ యత్నాలు
వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో నిర్ణయం తీసుకుంది. తొలుత ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ప్రకటన చేయలేదని బుకాయించిన ఏపీ బీజేపీ నేతలు, అనంతరం కేంద్రం పార్లమెంటులో పదే పదే స్పష్టత ఇవ్వడంతో మౌనంగా ఉండిపోయారు. ఇప్పటికీ విపక్ష ఎంపీలు కేంద్రమంత్రులకు రాస్తున్న లేఖలకు ఇస్తున్న సమాధానాల్లోనూ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణే స్టీల్ ప్లాంట్ను కాపాడుతుందని, లేకపోతే మూసివేతే అంతిమ నిర్ణయం అవుతుందని చెబుతోంది. దీంతో ప్రైవేటీకరణ తప్పదనే అంచనాకు అందరూ వచ్చేశారు.
అనూహ్యంగా లాభాల్లోకి వైజాగ్ స్టీల్
ప్రైవేటీకరణ తప్పదని నాలుగు నెలల క్రితమే తేలిపోయింది. ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం లేదని రాజకీయ పార్టీలు కూడా బహిరంగంగానే చెప్పడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అద్భుతం చోటు చేసుకుంది. అనూహ్యంగా ప్లాంట్కు నాలుగు నెలల్లో లాభాలు రావడం మొదలైంది. ప్రైవేటీకరణ ప్రయత్నాల నేపథ్యంలో అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు కానీ ప్లాంట్ మాత్రం లాభాల బాట పట్టింది. అంతే కాదు ఈ ఏడాది భారీ ఎత్తున ఉత్పత్తి కూడా చేసినట్లు తాజాగా సీఎండీ పీకే రథ్ చేసిన ప్రకటన ఇప్పుడు కేంద్రాన్ని కూడా ఆలోచనలే పడేసేలా ఉంది.
నాలుగు నెలల్లో రూ.740 కోట్ల లాభం
ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో నిర్ణయం తీసుకుంది. దీనికి ఒకట్రెండు నెలలకు ముందు నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా స్టీల్ ప్లాంట్ సీఎండీ పీకే రథ్ చేసిన ప్రకటన ప్రకారం చూస్తే స్టీల్ ప్లాంట్కు కేవలం నాలుగు నెలల్లోనే రూ.740 కోట్ల లాభం వచ్చింది. అంటే ఈ లెక్కన చూస్తే ఏడాదికి దాదాపు 2 వేల కోట్ల లాభం అన్నమాట. ఇదే పరిస్ధితి కొనసాగితే వైజాగ్ స్టీల్ ప్రైనేటీకరణ ఊసెత్తాల్సిన అవసరం లేకుండా పోతుంది. అదే సమయంలో గత ఆర్ధిక సంవత్సరంలో 13 శాతం వృద్ధితో 4.45 మిలియన్ టన్నుల అమ్మకాలు జరిగినట్లు యాజమాన్యం ప్రకటించింది. ఒక్క మార్చి నెలలోనే 7 లక్షల 11 వేల టన్నుల స్టీల్ అమ్మకాలతో రూ.3300 కోట్లు రాబట్టామని చెబుతోంది.
కేంద్రానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సవాల్
ఏ నష్టాల బాట పేరుతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని భావించిందో, ఏ నష్టాల పేరుతో అమ్మకానికి సిద్ధపడిందో, రాజకీయ పార్టీల విజ్ఞప్తుల్ని, ఉద్యమాల సెగల్ని లెక్కచేయడం లేదో అదే స్టీల్ ప్లాంట్ ఇప్పుడు లాభాల బాట పట్టింది. ప్రైవేటీకరణ ప్రకటన రాకముందే ప్రారంభమైన లాభాలు గత ఆర్ధిక సంవత్సరం ముగింపు వరకూ కొనసాగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్పబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. లాభాల బాటలోకి వచ్చిన స్టీల్ ప్లాంట్ను నష్టాల పేరుతో ప్రైవేటీకరిస్తే దేశవ్యాప్తంగా విమర్శలు ఖాయం. ఇప్పటికే దీనిపై కోర్టుల్లో ప్రజాప్రయోజన వాజ్యాలు కూడా పడ్డాయి. దీంతో స్టీల్ ప్లాంట్ విసిరిన లాభాల సవాల్కు కేంద్రం నుంచి వచ్చే సమాధానం కీలకంగా మారింది.