వాల్తేర్ డివిజిన్ అప్రమత్తం.. సమీక్షించిన డీఆర్ఎం.. అంతా ఓకే
అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా అగ్గిరాజుకుంది. పథకానికి వ్యతిరేకంగా నిరసలు కొనసాగుతున్నాయి. నిన్నటివరకు ఉత్తరభారతానికి పరిమితం అయిన ఆందోళనలు తెలంగాణ రాష్ట్రానికి చేరాయి. నిరసనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పెను విధ్వంసం సృష్టించారు. రైల్వే ఆస్తులు ధ్వంసం చేయడంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లను ఉపయోగించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులపై రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరికొందరు యువకులు గాయపడ్డారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి రైల్వే స్టేషన్ను మూసేశారు. ప్రయాణికులెవరు రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ ఘటనలో నాంపల్లి రైల్వే స్టేషన్ మూసివేశారు. ఎంఎంటీఎస్ రైళ్లను, మెట్రో రైళ్లను కూడా నిలిపివేశారు. దీంతో వాల్తేరు రైల్వే డివిజన్ కూడా అప్రమత్తమైంది. వాల్తేరు రైల్వే డివిజన్లోని విశాఖ సహా పలు స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వాల్తేరు డివిజన్లోని పరిస్థితిపై డీఆర్ఎం అనూప్ కుమార్ సమీక్షించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన పక్కా ప్లాన్తో నిర్వహించినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని.. దాని ద్వారానే కమ్యూనికేట్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా ఆర్మీ అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం ఆందోళన చేపట్టాలని ముందస్తుగా నిర్ణయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తమ సమస్యలు తీసుకురావాలని అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంచుకున్నట్టు అర్థం అవుతుంది.
ఆందోళన పరిస్థితిపై రైల్వే డీజీ సందీప్ శాండిల్య ఆరా తీశారు. ఆందోళనను కట్టడి చేయడంతోపాటు రైళ్ల పునరుద్ధరణ కోసం అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆర్పీఎఫ్, సీఐఎస్ఎఎఫ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు భారీగా రైల్వే స్టేషన్కు చేరుకున్నారు.