కోవిడ్ కాస్మెటిక్ : విశాఖ ఏజెన్సీలో పసుపుకు యమ క్రేజ్..ఎందుకో తెలుసా..?
విశాఖపట్నం: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ మహమ్మారి నుంచి విముక్తి పొందాలంటే ప్రధానంగా రెండే రెండు సూత్రాలు పాటించాలని ఇటు వైద్యాధికారులు అటు ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఒకటి ఇళ్లకే పరిమితం కావడం రెండోది వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం. దేశం లాక్డౌన్ పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది కాబట్టి ఎలాగూ ఇళ్లకే పరిమితమయ్యారు జనం. ఇక రెండోది వ్యాధి నిరోధక శక్తిని సహజపద్ధతుల ద్వారా పెంచుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. అంటే మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలని అదే సమయంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడంలో పసుపు కూడా బాగా ఉపయోగపడుతుందనేది ఒక అభిప్రాయం ఉంది. ఇక పసుపులో కెల్లా విశాఖ ఏజెన్సీ పసుపు వేరయా అని చాలామంది చెబుతున్నారు. దీంతో విశాఖ ఏజెన్సీలో పండే పసుపునకు యమ క్రేజ్ ఏర్పడుతోంది.

విశాఖ ఏజెన్సీ పసుపుకు డిమాండ్
ఒక చిన్న గాయమైందంటే ఇంట్లో వాళ్లు వంటింటి చిట్కాను ఉపయోగిస్తారు. గాయంపైన పసుపు రాస్తారు. ఎందుకిలా చేస్తారంటే పసుపు గాయానికి యాంటిబైటిక్లా పనిచేస్తుంది. సహజ వ్యాధి నివారణగా పసుపు పనిచేస్తుంది. తాజాగా కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పసుపుకు డిమాండ్ ఏర్పడింది. అయితే అన్ని చోట్లా పండే పసుపుకు కాదు. కేవలం విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో పండే పసుపుకు మాత్రమే డిమాండ్ ఏర్పడింది. ఇందులో ఉండే కర్క్యూమిన్ అనే పదార్థం వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసమే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో పండే పసుపును పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఔషధాలు తయారు చేస్తే ఫార్మా కంపెనీలు సైతం వ్యాధి నిరోధక శక్తి పెంచే ఈ పసుపును కొనుగోలు చేసేందుకు ఆస్తిక చూపుతున్నట్లు తెలుస్తోంది.

విశాఖ ఏజెన్సీ పసుపులో అధికంగా ఉండే కర్క్యూమిన్
ఇక విశాఖ ఏజెన్సీ కిందకు వచ్చే చింతపల్లి హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో విశాఖలో పండే పసుపు బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. విశాఖలోని గిరిజన ప్రాంతాల్లో దాదాపు 11వేల హెక్టార్లలో పసుపు పండుతోంది. ఇక్కడ పండే పసుపులో దాదాపు 6.5శాతం కర్క్యూమిన్ ఉంటుందని చెబుతున్నారు. ఈ కర్క్యూమిన్కు ఫార్మా రంగంలో మంచి డిమాండ్ ఉందని చెబుతున్నారు. దీన్ని వ్యాధినిరోధక శక్తి పెంపొందించే ఔషదాల్లో వినియోగిస్తారని చెబుతున్నారు.
Recommended Video

శ్వాసకోశ వ్యవస్థలో సమస్యలు ఉండవు
ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగించే పసుపు రోగనిరోధక శక్తి పెంచడంలో పనిచేస్తుందని డాక్టర్లు కూడా చెబుతున్నారు. కరోనావైరస్ విస్తరిస్తున్న వేళ వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు పసుపు బాగా పనిచేస్తుందని వైద్యులు సైతం చెబుతున్నారు. పసుపును వేడి పాలల్లో వేసుకుని తాగడం వల్ల శ్వాసకోశ వ్యవస్థలో సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వార్షిక పంటగా చెప్పుకునే పసుపు ప్రతి ఏటా మార్చి నుంచి మే నెలల మధ్య బాగా అమ్ముడుపోతుంది. హెక్టారుకు 8 టన్నుల పసుపును ఇక్కడ పండిస్తారు. విశాఖ ఏజెన్సీలో పండే నాణ్యమైన పసుపు ధర కిలో రూ.150 వరకు ఉంటుంది. ఇదిలా ఉంటే విశాఖ ఏజెన్సీలో పసుపును విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఐటీడీఏ అధికారులు చెప్పారు. అంతేకాదు యుద్ధ ప్రాతిపదికన విశాఖ ఏజెన్సీలో పండే పసుపును కొనుగోలు చేసి ఔషధ తయారీలో వినియోగించాలని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications