విశాఖలో వైసీపీ నేతల వీరంగం .. టోల్ సిబ్బందిపై దాడి; సీసీ టీవీ ఫుటేజ్ తో కేసు నమోదు
విశాఖపట్నం జిల్లాలో టోల్ ప్లాజా సిబ్బందిపై వైసీపీ నేతల దాడి కలకలం సృష్టించింది. టోల్ ఫీజు కట్టమని అడిగినందుకు టోల్ ప్లాజా సిబ్బందిపై వైసీపీ నాయకుడు, ఆయన అనుచరులు దాడి చేసిన ఘటన వేంపాడు టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది.
వేంపాడు టోల్ ప్లాజా వద్ద హంగామా చేసిన వైసీపీ నేతలు
నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద ఫీజు చెల్లించకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు వైసీపీ నాయకులు. పాయకరావు పేటకు చెందిన వైసీపీ నేత స్థానిక జెడ్పీటీసి ఎల్. సూర్యనారాయణ కార్ లో వెళ్తుండగా వేంపాడు టోల్ ప్లాజా దగ్గర టోల్ సిబ్బంది ఆపారు. టోల్ ఫీజు చెల్లించమని అడగగా జెడ్పీటీసీనే టోల్ కట్టమంటావా అంటూ కారులో ఉన్న వైసీపీ నాయకులు టోల్ సిబ్బందితో గొడవకు దిగారు. మాటా మాటా పెరగడంతో చివరకు అది గొడవకు దారి తీసింది. తమని అడ్డుకుంటారా అంటూ అధికార పార్టీ ప్రతినిధి అనుచరులు టోల్ ఫ్లాజా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు విచక్షణారహితంగా వారిపై దాడి చేశారు.
టోల్ సిబ్బందికి గాయాలు .. కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ ఘటనలో ఇద్దరు సిబ్బందికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు వైసిపి నాయకులు. దాడి చేసిన వారిని టోల్ గేట్ సూపర్ వైజర్ పి సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన సత్యనారాయణను తోటి సిబ్బంది నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కళ్యాణి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు. టోల్ ఫ్లాజా సిబ్బందిపై దాడికి తెగబడిన వైసిపి నాయకులు వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న టోల్ ప్లాజా యాజమాన్యం వైసీపీ నాయకులపై నక్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పాయకరావుపేట వైసిపి జెడ్పిటిసి ఎల్ సూర్యనారాయణతో పాటుగా ఆయన అనుచరులు శ్రీను, నానాజీలపై ఐపీసీ 323, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సీసీ టీవీ ఫుటేజ్ లో దాడి దృశ్యాలు
వైసిపి నాయకులు టోల్ ఫ్లాజా సిబ్బందిపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు అయినంత మాత్రాన టోల్ పన్ను చెల్లించకుండా వెళ్లాలన్న రూల్ లేదని టోల్ ప్లాజా సిబ్బంది అంటున్నారు. టోల్ పన్ను నుండి మినహాయింపు ఎవరికి ఉంటుందో స్పష్టంగా బోర్డులపై రాసి ఉంటుందని, మిగతా వారంతా టోల్ పన్ను చెల్లించాల్సిందేనని వారు తేల్చి చెబుతున్నారు. ఈ తరహా దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.

గతంలో కాజ టోల్ ప్లాజా వద్ద వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ దేవళ్ళ రేవతి హంగామా
ఇదిలా ఉంటే గతంలో కాజా టోల్ ప్లాజా వద్ద కూడా వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి టోల్ ప్లాజా కట్టమని అడిగినందుకు హంగామా చేశారు. టోల్ చెల్లించకుండా వెళుతున్న రేవతిని అడ్డుకోవడంతో తనని టోల్ చెల్లించాలని అడుగుతారా అంటూ సిబ్బందిపై దుర్భాషలాడుతూ, వారిపై చేయి చేసుకున్నారు. అప్పట్లో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. అప్పుడు కూడా టోల్ సిబ్బంది ఫిర్యాదుతో వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి పై, ఆయన డ్రైవర్ పై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు కాదు.












Click it and Unblock the Notifications