సాయన్న ప్రజాదర్బార్: విజయసాయి రెడ్డి కీలక నిర్ణయం: ప్రజల్లోకి..!
విశాఖపట్నం: అధికార వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. జనంలోకి మరింత చొచ్చుకెళ్లేలా అడుగులు వేశారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని తక్షణమే పరిష్కరించడానికి నడుం బిగించారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేక కార్యాచారణ ప్రణాళికను ప్రకటించారు. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోనున్నారు.

సీతమ్మధార కార్యాలయంలో..
విజయసాయి రెడ్డికి విశాఖపట్నంలోని సీతమ్మధారలో కార్యాలయం ఉంది. ఇందులో ప్రతి రోజూ ప్రజా దర్బార్ను నిర్వహిస్తోన్నారు సాయిరెడ్డి. దీనికి సాయన్న ప్రజాదర్బార్ అని పేరు పెట్టారు. రోజూ ఈ ప్రజాదర్బార్ అందుబాటులో ఉంటుంది. విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి అందుబాటులో ఉన్న సమయంలో ఆయనే స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తారు. ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఆయన అందుబాటులో లేనప్పుడు.. సిబ్బంది ఈ కార్యక్రమాన్ని చేపడతారు. ప్రజల నుంచి ఫిర్యాదులను.

అక్కడికక్కడే పరిష్కారానికి నోచుకునేలా..
ప్రజల నుంచి అందే ఫిర్యాదులను పరిష్కరించడానికి అక్కడికక్కడే చర్యలు తీసుకుంటారు. శాఖల వారీగా వాటిని అప్పటికప్పుడు, అక్కడికక్కడే సంబంధిత విభాగాల అధికారులకు పంపిస్తారు. సాయన్న ప్రజాదర్బార్ నిర్వహించే సమయంలో ఫిర్యాదుదారుల నుంచి ఫోన్ నంబర్, అడ్రస్ను తీసుకుంటారు. వారు ఇచ్చిన ఫిర్యాదులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేశారు విజయసాయి రెడ్డి.

ట్రాకింగ్ సిస్టమ్ కూడా..
స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులకు నంబరింగ్ ఇస్తారని, అవి ఏ శాఖలో.. ఏ స్థాయిలో పరిష్కార దశలో ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుందని చెబుతున్నారు. అలాగే- తాము ఇచ్చిన ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకున్నాయా? లేదా? అనేది ఫిర్యాదుదారుడికి ఫోన్ ద్వారా తెలియజేస్తారు. టెక్స్ట్ మెసేజీల రూపంలోనూ సమాచారం వారికి అందేలా ఏర్పాటు చేశారని అంటున్నారు.

సోషల్ మీడియా సహకారం తీసుకుంటారా?
సదరు ఫిర్యాదు- ఏ విభాగంలో ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ట్రాకింగ్ వ్యవస్థను కూడా త్వరలో అందుబాటులో తెస్తారని సమాచారం. ఇందులో- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల సహకారాన్ని కూడా తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వానికి మంచి పేరును తీసుకుని రావాలనే ఉద్దేశం కావడం వల్ల పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇందులో భాగస్వామ్యులను చేస్తారని చెబుతున్నారు. సాయన్న ప్రజాదర్బార్.. ఎంత వరకు విజయవంతమౌతుందనేది వేచి చూడాల్సి ఉంది.

వైఎస్ జగన్ ఆదేశాలతో..
కాగా- ప్రజా ప్రతినిధులు ప్రతిరోజూ తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిరోజుల కిందటే తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించిన విషయం తెలిసిందే. ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఆదేశించారు. నిత్యం ప్రజల్లో ఉండాలని, వారితో మమేకం కావాలని దిశా నిర్దేశం చేశారు. వేల కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్నందున.. వాటిపై పకడ్బందీగా పర్యవేక్షణ ఉండాలనేది వైఎస్ జగన్ అభిప్రాయపడుతున్నారు.

డెలివరీ సిస్టమ్పై..
దీనికి అనుగుణంగా- విజయసాయి రెడ్డి.. ఈ సాయన్న ప్రజాదర్బార్ను ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా ఏర్పాట్లు చేయడం, కొత్త వారిని దీని పరిధిలోకి తీసుకుని రావడం అనేది ప్రధానంగా ఉంటుంది. వలంటీర్లు సక్రమంగా పని చేయకపోయినా.. లబ్దిదారులు ఈ విషయాన్ని ప్రజా దర్బార్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. సంక్షేమ పథకాల డెలివరీ వ్యవస్థలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నా వాటిని అప్పటికప్పుడు పరిష్కరించేలా ఈ సాయన్న ప్రజాదర్బార్ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications