రామతీర్థం వద్ద సోము వీర్రాజు అరెస్ట్: చంద్రబాబుకు అనుమతి ఎలా?: టీడీపీతో వైసీపీ కుమ్మక్కు
విజయనగరం: విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థం మళ్లీ భగ్గుమంటోంది. నాయకులు అరెస్టుల పర్వంతో వేడెక్కింది. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జనసేన-భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా నిర్వహిస్తోన్న రామతీర్థం ధర్మయాత్రలో భాగంగా అక్కడికి చేరుకున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. రామతీర్థం కొండవద్దకు చేరుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారు. అరెస్టులకు నిరసనగా బీజేపీ, జనసేన నేతలు రోడ్డు మీదే బైఠాయించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. మరోవంక- ఉత్తరాంధ్రలో పలువురు బీజేపీ, జనసేన నేతలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.
సోము వీర్రాజు అరెస్ట్..
రామతీర్థాన్ని సందర్శించడానికి వెళ్లిన బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. రామతీర్థం కొండ వరకూ ఆయనను వెళ్లనివ్వలేదు. మార్గమధ్యలోనే అరెస్ట్ చేశారు. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనితో వారిమధ్య తోపులాట చోటు చేసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఉద్దేశించిన సెక్షన్ 30 ప్రస్తుతం అమల్లో ఉందని, ఈ పరిస్థితుల్లో ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదంటూ పోలీసులు బీజేపీ నేతలకు వివరించే ప్రయత్నం చేశారు.

నెల్లిమర్ల, రామతీర్థంలల్లో హైటెన్షన్..
తనను రామతీర్థం వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం పట్ల సోము వీర్రాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడులకు రామతీర్థాన్ని సందర్శించడానికి పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. అప్పుడు సెక్షన్ 30 గుర్తుకు రాలేదా అని నిలదీశారు. రాజకీయంగా తమ పార్టీ ఎదుగుదలను అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

పిరికిచర్యగా
రామతీర్థాన్ని సందర్శించడానికి తాము వెళ్లి తీరుతామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. కోట్లాదిమంది హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుడిని దర్శించుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం ప్రభుత్వ పిరికి చర్యగా ఆయన అభివర్ణించారు. తాము రాములవారిని దర్శించి తీరుతామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసాన్ని అడ్డుకోలేకపోతోన్న ప్రభుత్వం. నిరసన తెలియజేస్తోన్న తమను అదుపులోకి తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
బికినీలో కరీనాకపూర్.. ప్రెగ్నెన్సీ టైమ్లో బయటకు వచ్చిన బ్యూటీ

కొనసాగుతోన్న గృహ నిర్బంధాలు..
మరోవంక బీజేపీ, జనసేన నేతల గృహ నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు బీజేపీ, జనసేన నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తెల్లవారు జాము నుంచే వారి ఇళ్ల వద్ద పహారాలో ఉన్నారు. నేతలెవరినీ ఇంట్లో నుంచి బయటికి రానివ్వలేదు. అయినప్పటికీ.. కొందరు జనసేన నాయకులు ఛలో రామతీర్థం బ్యానర్లను ప్రదర్శిస్తూ ధర్మయాత్రలో పాల్గొన్నారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. నెల్లిమర్ల, రామతీర్థాలకు దారి తీసే మార్గాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అందరినీ తనిఖీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications