ఏముంది ఇండియాలో- కరప్షన్..పొల్యూషన్.. డర్టీ రోడ్స్: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలనం
విజయనగరం: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో ప్రస్తుతం నెలకొన్న స్థితిగతులపై బాంబు పేల్చారు. భారత్ను పొరుగుదేశాలతో పోల్చి చూశారు. ఇక్కడి కంటే ఆయా దేశాల పరిస్థితులే బాగున్నాయంటూ కితాబిచ్చారు. వ్యవస్థల్లో ఎన్నో లోపాలు చోటు చేసుకుంటోన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతోందని పేర్కొన్నారు.
జీఎంఆర్ఐటీలో..
విజయనగరం జిల్లా రాజాంలో గల జీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జున రావు సారథ్యంలో జీఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన విద్యాసంస్థ ఇది. సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
నాయకత్వ లక్షణాలు తప్పనిసరి..
నాయకత్వ లక్షణాలను విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దేశానికి అలాంటి యువతరమే అవసరం ఉందని నారాయణ మూర్తి అన్నారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను మార్పునకు అవకాశంగా భావించాలని సూచించారు. తమను తాము నాయకుడిగా ఊహించుకోవాలని, ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన అవసరం లేదనీ అన్నారు. నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకోవాలని అన్నారు.
అవినీతి, కాలుష్యం..
దేశంలో వాస్తవికత అంటే ఏమిటీ? అని ప్రశ్నించారాయన. నిజానికి భారత్లో అవినీతి, కాలుష్యం అధికంగా ఉందని నారాయణ మూర్తి తేల్చి చెప్పారు. రోడ్లు కూడా అధ్వాన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. డర్టీ రోడ్స్ అని వ్యాఖ్యానించారు. భారత్తో పోల్చి చూసినప్పుడు సింగపూర్ ఎంతో బాగుంటుందని పేర్కొన్నారు. అక్కడి వాతావరణం, వ్యవస్థల పనితీరు చక్కగా ఉంటుందని అన్నారు. వాస్తవికత అంటే పరిశుభ్రమైన రహదారులు, కాలుష్య రహిత వాతావరణ సింగపూర్లో ఉందని పేర్కొన్నారు.
మార్పును తీసుకుని రావాలి..
అలాంటి కొత్త, వాస్తవికత పరిస్థితులను సృష్టించడం విద్యార్థుల బాధ్యత అని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి స్పష్టం చేశారు. సమాజంలో మార్పును తీసుకురావాలనే ఆలోచనను యువతరం పెంపొందించుకోవాల్సి ఉందని, వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజలు, సమాజం, దేశం సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని అలవాటు చేసుకోవాలని, వాటిని నేర్చుకోవాలని ఆయన హితబోధ చేశారు.
జీఎంఆర్ నుంచి స్ఫూర్తి..
జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు గురించి నారాయణ మూర్తి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆయన నుంచి విద్యార్థులు స్ఫూర్తిని పొందాలని సూచించారు. ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్తగా మారే ప్రయత్నాన్ని చేయాలని, అందుకు జీఎంఆర్ను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. పారిశ్రామికవేత్తలుగా మరిన్ని ఉద్యోగాలను సృష్టించాలని కోరారు. పేదరికం, సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించడానికి అధిక ఉద్యోగాలను కల్పించడమే ఏకైక పరిష్కారమని అన్నారు.