SI Bhavani Suicide: విజయనగరంలో మహిళా ట్రైనీ ఎస్సై భవానీ ఆత్మహత్య... ఏమై ఉంటుంది...
విజయనగరం జిల్లా కేంద్రంలోని పీటీసీ(పోలీస్ ట్రైనింగ్ కాలేజీ)లో ఓ మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. ఐదు రోజుల క్రితం శిక్షణ నిమిత్తం ఆమె ఇక్కడికి వచ్చారు. శనివారం(ఆగస్టు 28) మధ్యాహ్నంతో శిక్షణ పూర్తయింది. ఆదివారం ఆమె తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది. ఇంతలోనే ఆమె పీటీసీ కాలేజీ హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... 2018 బ్యాచ్కి చెందిన ఎస్సై భవానీకి ఇటీవలే తూర్పు గోదావరి జిల్లాలోని సఖినేటిపల్లిలో అడిషనల్ ఎస్సైగా మొదటి పోస్టింగ్ ఇచ్చారు. రాజోలు పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ అనంతరం.. ఆమెకు ఈ పోస్టింగ్ లభించింది. ఎస్సైగా నియమించబడటంతో.. క్రైమ్ శిక్షణ నిమిత్తం ఆమె ఐదు రోజుల క్రితం విజయనగరంలోని పీటీసీకి వచ్చారు.
శనివారంతో ట్రైనింగ్ ముగియగా.. ఆదివారం భవానీ తిరిగి సఖినేటిపల్లి వెళ్లాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆమె హాస్టల్ గదిలోని ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయారు. అర్ధరాత్రి సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. భవానీ ఆత్మహత్యకు కారణాలేంటన్నది ఇంకా తెలియరాలేదు.

భవానీ స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామం. ఆమె అవివాహితురాలు. చివరిసారిగా ఆమె విశాఖపట్నంలో ఉన్న సోదరుడు శివతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది.శిక్షణ పూర్తయిందని చెప్పేందుకు అతనికి ఫోన్ చేసినట్లు సమాచారం. భవానీ ఆత్మహత్యపై స్పందించిన విజయనగరం డీఎస్పీ పి.అనిల్కుమార్.. కారణాలు తెలియాల్సి ఉందన్నారు. వన్ టౌన్ పీఎస్లో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
రైతు కుటుంబానికి చెందిన భవానీ కష్టపడి చదువుకుని ఎస్సై జాబ్ సాధించారు.అయితే ఆ పోస్టులో చేరక ముందే భవానీ ఆత్మహత్యకు పాల్పడటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు దారితీసిందా అనే అనుమానం వ్యక్తమవుతోంది.
గతంలో సంచలనం సృష్టించిన మహిళా ఎస్సై శ్రావణి ఆత్మహత్య :
గుంటూరు జిల్లా చుండూరు ఎస్సై పిల్లి శ్రావణి ఆత్మహత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు.ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన పిల్లి శ్రావణి.. 2018లో ఎస్సైగా పోలీస్ శాఖలో ఉద్యోగంలో చేరారు. తొలుత గుంటూరు జిల్లాలోని అడవులదీవి, నరసరావుపేట దిశ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేశారు. అక్కడి నుంచి చుండూరు ఎస్సైగా బదిలీ అయ్యారు.
ఈ క్రమంలో ఉన్నట్టుండి ఓరోజు ఆమె ఆత్మహత్యకు యత్నించారు. ఆమెతో పాటు అదే పోలీస్ స్టేషన్లో పనిచేసే రవీంద్ర అనే కానిస్టేబుల్ కూడా ఆత్మహత్యకు యత్నించాడు. ఇద్దరూ కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకుని తాగారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రావణి మృతి చెందారు. చుండూరు సీఐ వేధింపులే తన ఆత్మహత్యకు కారణంగా పిల్లి శ్రావణి తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. కొన్ని కేసుల్లో తనపై రిట్ పిటిషన్లు వేయించడంతో పాటు కానిస్టేబుల్తో అక్రమ సంబంధం అంటగట్టారని వాపోయారు. అలాగే తాను లంచాలు తీసుకుంటున్నట్లు పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో... మనస్తాపం చెందిన శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడైంది.












Click it and Unblock the Notifications