వరంగల్ లో సీఎం కేసీఆర్ పర్యటన .. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి భూమి పూజ, నూతన కలెక్టరేట్ ప్రారంభం .. షెడ్యూల్ ఇలా
నేడు వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ పదో వర్ధంతి సందర్భంగా నేడు వరంగల్ అర్బన్ జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమిపూజ తో పాటు , పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించటంతో పాటుగా, జిల్లాలో అత్యధికంగా అన్ని హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లాలో టిఆర్ఎస్ శ్రేణులు జోష్ నెలకొంది.

జయశంకర్ పదవ వర్ధంతి నాడు వరంగల్ కు సీఎం .. జయశంకర్ సార్ కు నివాళి
ఇక ఈ రోజు సీఎం కేసీఆర్ షెడ్యూల్ వివరాలు చూస్తే మొదట హనుమకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్. జయశంకర్ పార్క్ లో ప్రొఫెసర్ జయశంకర్ పదవ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత హన్మకొండలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. వరంగల్ ను అత్యాధునిక వైద్య సేవల కేంద్రంగా తీర్చిదిద్దటంలో భాగంగా 1000 కోట్లతో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నట్లుగా తెలుస్తుంది.

మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి భూమిపూజ , కాళోజీ వర్సిటీ భవన ప్రారంభం
59 ఎకరాల విశాలమైన స్థలంలో అత్యవసర వైద్య సేవలకు అనుగుణంగా భవనంపై హెలికాప్టర్ దిగేలా హెలిపాడ్ ఏర్పాటుతో దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిని వరంగల్ లో నిర్మించ తలచారు సీఎం కేసీఆర్.
ఆపై కాళోజి హెల్త్ యూనివర్సిటీ భవనాన్ని ప్రారంభించనున్నారు. కాళోజి హెల్త్ యూనివర్సిటీ కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి 25 కోట్లతో 5 అంతస్తులతో 69 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని ఈరోజు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.

వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభం
ఆ తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు 6.73 ఎకరాల్లో 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో ఈ భవనాన్ని నిర్మించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవం నేపథ్యంలో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుండి బేగంపేట ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న కేసీఆర్ అక్కడ నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ లో హనుమకొండకు చేరుకుంటారు.
Recommended Video
12 గంటల నుండి 3 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో సీఎం
12 గంటలకు హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకునే సీఎం కేసీఆర్ మూడు గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆపై యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లాలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో సీఎం కేసీఆర్ పర్యటన నూతన ఉత్సాహాన్ని నింపుతుంది.












Click it and Unblock the Notifications