సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ , ఆ ఎమ్మెల్యే కబ్జా కోరు అంటూ వరంగల్ లో కరపత్రాల కలకలం
వరంగల్ అర్బన్ జిల్లాలో సీఎం రాక సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏకంగా టిఆర్ఎస్ పార్టీ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పై నియోజకవర్గ వ్యాప్తంగా కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. ఈ పని చేసింది ఎవరన్నది పోస్ట్ మార్టం చేసే పనిలో ఉన్నారు సదరు ఎమ్మెల్యే . సొంత పార్టీ నేతలా ? లేక ప్రతిపక్షాల నాయకులా అన్నది చర్చకు కారణం అవుతుంది.

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పై కరపత్రాల కలకలం
తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కబ్జా కోరు అంటూ కరపత్రాలు ముద్రించి మరీ పంపిణీ చేయడం, అది కేసీఆర్ పర్యటన నేపథ్యంలోకావటంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పై సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ ను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. న్యూస్ పేపర్ లో పెట్టి మరి వరంగల్ తూర్పు లో పెద్ద ఎత్తున పంపిణీ కార్యక్రమం కొనసాగింది.
ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని, భూకబ్జాలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు
మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బీ ఫామ్స్ 50లక్షల రూపాయలకు అమ్ముకున్నాడని, గతంలో ములుగు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే డబ్బులు వసూలు చేశాడని ఆ కరపత్రంలో ఆరోపణలు గుప్పించారు. ఇక వరంగల్ తూర్పు నియోజకవర్గంలో భూకబ్జాలు,అధికార పార్టీ నేతలపై వేధింపులు,సెటిల్మెంట్లు కొనసాగిస్తున్నారు అంటూ లేఖలో ఘాటుగా ఆరోపణలు చేశారు గుర్తు తెలియని అగంతకులు.
పార్టీ పరువు తీస్తున్నారు నరేందర్ అంటూ ఘాటుగా రాసిన ఆగంతకులు
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ఎవరు వచ్చినా మీ పార్టీ నుండి ప్రజలకు ఇదే దరిద్రం పట్టుకుంటుంది అంటూ దొంగలకు , కబ్జా దారులకు టికెట్ లు ఇస్తూ పార్టీ పరువు తీస్తున్నారు అంటూ ఏకంగా సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి ఈ కరపత్రాలు ముద్రించడం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది. బార్లో గ్లాసులు కడిగే వెయిటర్ కు టిఆర్ఎస్ పార్టీ పదవులు ఇస్తే, ఇదే విధంగా ఉంటుంది అంటూ ఆ కరపత్రంలో పేర్కోవడం గమనార్హం.
Recommended Video
కొంత కాలంగా నరేందర్ పై భూకబ్జా ఆరోపణలు .. సీఎం టూర్ సమయంలో చర్చనీయాంశం
ఏది ఏమైనా గత కొంతకాలంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పై భూకబ్జా ఆరోపణలు నియోజకవర్గంలో వెల్లువెత్తుతున్న వేళ తాజాగా సీఎం కేసీఆర్ పర్యటన సమయంలో నన్నపనేని నరేందర్ పై కరపత్రాలు బయటకు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈటల విషయంలో భూ కబ్జా ఆరోపణలు నేపథ్యంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ మరి ఈ వ్యవహారంలో ఏం చేస్తారనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications