నేటినుండే కాకతీయ ఉత్సవాలు: కాకతీయ వారసుడికి ఘనంగా స్వాగతం; వైభవ సప్తాహం షెడ్యూల్ ఇదే!!
వరంగల్ : కాకతీయుల చరిత్రను కళ్లకు కట్టేలా, చరిత్రలో చిరస్థాయిగా మిగిలి పోయేలా వారం రోజులపాటు కాకతీయ వైభవ సప్తాహం నేటి నుండి ప్రారంభం కానుంది. నేటి నుండి ఏడు రోజుల పాటు కాకతీయ రాజుల ఘన చరిత్రను భావితరాలకు తెలియజేసేలా కాకతీయ వైభవ సప్తాహం నిర్వహించనున్నారు. కాకతీయ వైభవం ఏడు తరాలకు గుర్తుండే విధంగా వారం రోజుల పాటు వేడుకలు కన్నుల పండుగలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకతీయుల ఘన కీర్తిని చాటేందుకు వరంగల్లో కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.
కాకతీయ ఉత్సవాలలో పాల్గొననున్న కాకతీయ వారసుడు కమల చంద్ర భాంజ్ దేవ్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటి సారిగా ఈ కాకతీయ ఉత్సవాలను భారీ స్థాయిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. కాకతీయ వంశానికి చెందిన 22వ వారసుడైన కమల చంద్ర భాంజ్ దేవ్ తెలంగాణలో జరగనున్న కాకతీయ ఉత్సవాలలో పాల్గొననున్నారు. ఇక కాకతీయ వైభవ సప్తాహం షెడ్యూల్ చూస్తే ఈ సప్తాహంలో భాగంగా మొదటి రోజు గురువారం 600 మంది జానపద, పేరిణి శివతాండవం, ఒగ్గు డోలు, కళాకారులు కాకతీయుల వారసుడు కమల్ చంద్ర బంజ్ ను స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు చేశారు. అనంతరం కాకతీయ వారసులు భద్రకాళి ఆలయం, వేయి స్తంభాల ఆలయం, పద్మాక్షి ఆలయాలను దర్శించుకుంటారు.
వేడుకల షెడ్యూల్ ఇలా
వేడుకల షెడ్యూల్ ప్రకారం ఏడవ తారీకు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మాదాపూర్ లో ఛాయాచిత్ర ప్రదర్శన ఆవిష్కరణ ఉత్సవం జరుగుతుంది. రెండో రోజు 8వ తేదీ ఉదయం 10 గంటలకు అంబేద్కర్ భవన్లో కవి సమ్మేళనం కార్యక్రమం ఉంటుంది. నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణం లో సాయంత్రం ఐదు గంటల నుండి నాటక ప్రదర్శన జరుగుతుంది. ప్రతిరోజు రెండు నాటకాలను నేరెళ్ళ వేణుమాధవ్ పండగలలో ప్రదర్శించనున్నారు. ఇదే సమయంలో శాస్త్రీయ సంగీత కచేరీ, వడ్డేపల్లి బాండ్ పై వేడుకలు నిర్వహించనున్నారు. ఖిల్లా వరంగల్ ఖుష్ మహల్ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతిరోజు సాయంత్రం 5:00 నుండి నిర్వహించనున్నారు.
భద్రకాళీ ట్యాంక్ బండ్ పై ఫుడ్ ఫెస్టివల్
8వ తేదీ నుండి 12వ తేదీ వరకు వేయిస్తంభాల దేవాలయంలో సాయంత్రం 5:00 నుండి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక 9వ తేదీ నుండి 10వ తేదీ వరకు భద్రకాళీ బండ్ పై ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు పబ్లిక్ గార్డెన్ టౌన్ హాల్ లో పెయింటింగ్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు 11వ తేదీన అంబేద్కర్ భవన్ లో ఉదయం 10 గంటలకు షార్ట్ ఫిలిం ఫెస్టివల్, అలాగే నల్గొండ జిల్లా చందుపట్ల, నకిరేకల్ లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. నల్గొండ జిల్లా పానగల్లు ఆయంలో చరిత్రకారులు, మేధావులతో వేడుకలు నిర్వహించనున్నారు.
వేడుకల ముగింపు రామప్పలో
11వ తేదీ మరియు 12 వ తేదీలలో నిట్ లో మిషన్ కాకతీయ, కాకతీయుల ఐడియాలజీలపై సదస్సు నిర్వహించనున్నారు. 12వ తేదీన ఖిల్లా వరంగల్ లో కార్నివాల్ మరియు ఫుడ్ ఫెస్టివల్ సాయంత్రం ఐదు గంటల నుండి నిర్వహించనున్నారు. వేడుకల్లో చివరి రోజు 13న రామప్ప ఆలయం వద్ద కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శనలతో వేడుకలకు ముగింపు పలకనున్నారు. వేడుకలకు హజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
తెలంగాణా ఏర్పడిన తర్వాత తొలిసారి కాకతీయ ఉత్సవాలు
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరిసారిగా 2012 డిసెంబర్ 21 వ తేదీ నుంచి మూడు రోజులపాటు కాకతీయ ఉత్సవాలను నిర్వహించారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2017- 2018 లో ఓరుగల్లు కళావైభవం పేరుతో ఉత్సవాలు కొనసాగాయి. అనంతర కాలంలో రామప్ప దేవాలయం నిర్మిం చి 800 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించారు. ఇక తాజాగా కాకతీయ వైభవ సప్తాహం పేరుతో మరోసారి నేటి నుండి ఈ నెల 13వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
నేడు కాకతీయ ఉత్సవాలను ప్రారంభించనున్న పర్యాటకశాఖామంత్రి
నేడు కాకతీయ ఉత్సవాలను నాటి కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు ఖిల్లాలో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ సంతోష్ కుమార్ ,సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు. కాకతీయ నిర్మించుకున్న 7 కోటలకు గుర్తుగా ఏడు కోటల పరిధిలో ఉత్సవాలను నిర్వహించనున్నారు . కాకతీయుల పేరిణీ నృత్యాలు, కోలాటాలు, సాహితీ సమావేశాలు, సెమినార్ల నిర్వహణలో ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.