వరంగల్ చాయ్ వాలా మహ్మద్ పాషాకు ప్రధాని మోదీ ఆహ్వానం -రెడీగా ఉండాలంటూ పీఎంఓ లేఖ
తీవ్రత తగ్గినప్పటికీ దేశంలో కరోనా విలయం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. లాక్ డౌన్లు, ఆంక్షలు, వైరస్ వ్యాప్తి భయాలతో మెడికల్ రంగం తప్ప దాదాపు అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కొవిడ్ కాలంలో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని తీసుకొచ్చిన కేంద్రం.. బడా కార్పోరేట్ సంస్థలకు భారీగా తాయిలాలిచ్చింది. అదే సమయంలో పేదలు, చిన్న తరహా వ్యాపారులకు సైతం సహాయాన్ని ప్రకటించింది. గతేడాది రూ.20 లక్షల ప్యాకేజీకి తోడు, ఇటీవలే మరో రూ.6లక్షల కోట్లతో కేంద్రం తాజా ప్యాకేజీని ప్రకటించింది. ఆత్మనిర్బర్ భారత్ ద్వారా లబ్దిపొందిన వరంగల్ చాయ్ వాలాకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆహ్వానం అందిందిప్పుడు..
జగన్ దెబ్బకు కదిలిన మోదీ: వ్యాక్సిన్ల పంపిణీపై కేంద్రం కీలక సవరణలు -ప్రైవేట్ ఆస్పత్రులకు భారీ షాక్
ప్రధాని మోదీ దేశంలోని సమకాలీన పరిస్థితులు, సమస్యలపై తన 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా ప్రతి నెలా చివరి ఆదివారం కీలక ప్రసంగం చేస్తుండటం, ఆయా అంశాలను బట్టి వివిధ రంగాల్లోని ప్రజలతోనూ ఆయన మాట్లాడుతుండటం తెలిసిందే. మన్ కీ బాత్ లో దేనిపై మాట్లాడాలో, ప్రస్తావనకు అర్హులైన వ్యక్తుల వివరాలను పంపాల్సిందిగా ప్రధాని ప్రతిసారి విన్నవిస్తుండటం విదితమే. ఆ క్రమంలోనే జులై నెలకు సంబంధించిన మన్ కీ బాత్ లో ఆత్మ నిర్భర్ భారత్ పై మాట్లాడనున్న ప్రధాని... ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణకు చెందిన ఓ సాధారణ చాయ్ వాలాను ఆహ్వానించారు..
తెలంగాణ సాంస్కృతిక రాజధాని వరంగల్ నగరానికి చెందిన చాయ్వాలా మహ్మాద్ పాషాకు మోదీ మన్కీ బాత్ కార్యక్రమం నుంచి ఆహ్వానం అందింది. జులై మొదటి వారంలో మోదీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉండాలంటూ పాషాకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి లేఖ అందింది. ఈ విషయాన్ని వరంగల్ జిల్లా ఉన్నతాధికారులు సైతం ధృవీకరించారు.
మహ్మద్ పాషా ఎంజీఎం ఆస్పత్రి వద్ద 40 ఏళ్లుగా ఫుట్పాత్పై చాయ్ షాపు నిర్వహిస్తున్నారు. గతేడాది ఆగస్టులో పీఎం ఆత్మనిర్భర్ పథకం ద్వారా రూ.10వేల రుణాన్ని కూడా పాషా అందుకున్నారు. ఆ మొత్తాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దీంతో పాటు టీ అమ్మకాలకు గూగుల్పే, ఫోన్పే ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ మొదటి స్థానంలో నిలిచారు. దీంతో..
ఆత్మనిర్భర్ ద్వారా రుణం పొందిన వీధి వ్యాపారుల్లో అతి తక్కువ మందిని మన్కీ బాత్కు ఎంపిక చేశారు. అందులో పాషా ఒకరని వరంగల్ జిల్లా మెప్మా పీడీ భద్రు మీడియాకు తెలిపారు. మోదీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉండాలంటూ ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిన విషయాన్ని ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని పాషా చెప్పారు. ప్రధాని మోదీతో మాట్లాడబోయే క్షణాల కోసం ఎదురుచూస్తున్నానంటూ పాషా ఆనందం వ్యక్తం చేశారు.