మేడారానికి సారాలమ్మ.. 18న కేసీఆర్ రాక, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
వనదేవతలు సమ్మక్క సారాలమ్మ జాతర అంగరంగ వైభవంగా మొదలైంది. దేవతలను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. కన్నెపల్లి నుంచి జంపన్న వాగుకు సారలమ్మ అమ్మవారు చేరారు. మేడారానికి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు చేరుకున్నారు. మూడంచెల పోలీస్ భద్రత మధ్య సారలమ్మ దేవతను తరలిస్తారు. ఆదివాసీ సంప్రదాయాలతో వన దేవతల తరలింపు కార్యక్రమం జరుగుతుంది. సారలమ్మ దర్శనం కోసం భక్తులు నిరీక్షిస్తున్నారు.
Recommended Video
ఇటు మేడారం అమ్మవారి దర్శనం కోసం సీఎం కేసీఆర్ పర్యటన ఖరారు అయ్యింది. ఈ నెల 18న కేసీఆర్ మేడారం జాతరకు వెళ్లనున్నారు. వన దేవతలైన సమ్మక్క - సారలమ్మకు కేసీఆర్ బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకుంన్నారు. మేడారం జాతర నేటి నుంచి 19వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. ఈ జాతరకు దాదాపు కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మంత్రులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక సీఎం కేసీఆర్ 20వ తేదీన ముంబయికి వెళ్లనున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ నెల 21న నారాయణఖేడ్లో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. 23వ తేదీన మల్లన్న సాగర్ రిజర్వాయర్ను కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇటు జిల్లాల పర్యటనతో కూడా కేసీఆర్ బిజీగా ఉన్నారు. సమయం తీసుకొని మరీ.. సీఎంలను కలుస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు. అమ్మవారి సేవలో కూడా ఉంటున్నారు.
నేటి నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది. ఇక్కడ నిర్వహించే సమ్మక్క-సారలమ్మ వేడుకలు ఆసియాలో అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరుగాంచాయి. మేడారం జాతరకు వెళ్లేవారికోసం హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. తంబి ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ హెలికాప్టర్ సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి మేడారం జాతరకు హెలికాప్టర్లు నడపనుంది. ఒకరికి రానుపోను చార్జీలు రూ.19,999 అని వెల్లడించారు. హైదరాబాద్ నుంచి మేడారంకు రూ.75,000 చెల్లించాలి. మేడారం జాతర విహంగ వీక్షణం కోసం మరో రూ.3,700 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బుధవారం నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వస్తాయి. హెలికాప్టర్లో వెళ్లిన వారికి సిబ్బందే దర్శనం చేయించి.. తిరిగి పంపిస్తారు.