అతివేగం.. నిద్రమత్తు: అయిదుమంది యువకుల ప్రాణాలు బలి: వరంగల్ రూరల్ జిల్లాలో
వరంగల్: అతివేగానికి నిద్రమత్తు తోడుకావడం ఘోర రోడ్డు ప్రమాదానికి దారి తీసింది. అయిదుమంది యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. ఆ అయిదుమందీ సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలు కావడం ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. మృతులందరూ ఒకే ప్రాంతానికి చెందిన వారని ప్రాథమికంగా నిర్ధారించారు. వరంగల్ రూరల్ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
పోచం మైదాన్ ప్రాంతానికి చెందిన రాకేశ్, చందు, రోహిత్, సాబీర్, పవన్ కారులో పరకాలకు బయలుదేరారు. మార్గమధ్యలో వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం వద్ద వారు ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వచ్చిన ఇసుక లారీ అతి వేగానికి అదుపు తప్పి కారును ఢీ కొట్టింది. దీనితో అందులో ప్రయాణిస్తోన్న అయిదుమందీ సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇసుక లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Recommended Video
సమాచారం అందుకున్న వెంటనే పరకాల ఏసీపీ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టమ్ కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు, సహాయక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. అతివేగం, నిద్రమత్తు వల్లే ఆ ఘటన చోటు చేసుకుని ఉండొచ్చని నిర్ధారించినట్లు శ్రీనివాస్ వెల్లడించారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications