మంత్రి రోజాకు అరుదైన అవకాశం : ప్రధాని- సీఎంతో కలిసి : చిరు - పవన్ పై కీలక వ్యాఖ్యలు..!!
సుదీర్ఘ నిరీక్షణ తరువాత మంత్రి పదవి దక్కించుకున్న రోజాకు అరుదైన అవకాశం దక్కింది. దేశ ప్రధాని - సీఎం జగన్ కలిసి హాజరైన ఒక అరుదైన వేదికలో మంత్రి హోదాలో పాల్గొన్నారు. ప్రధాని ఆశీనులైన వేదిక పైన మొత్తం 11 మందికి అవకాశం ఇచ్చారు. అందులో గవర్నర్ ..సీఎం జగన్..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా రోజా - చిరంజీవి- సోము వీర్రాజు ఉన్నారు. కేంద్ర - రాష్ట్ర పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125 జయంతోత్సవాలను నిర్వహిస్తున్నారు.

కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రముఖులకు ఆహ్వానాలు.. కార్యక్రమ నిర్వహణ పైన పర్యవేక్షణ చేసారు. కాగా, రాష్ట్ర మంత్రిగా రోజా కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం గురించి పత్రికల్లో భారీ స్థాయిలో మంత్రి హోదాలో రోజా ప్రకటనలు ఇచ్చారు. ఇక, సభలో పాల్గొనే ముందు రోజా కీలక వ్యాఖ్యలు చేసారు. ఇటువంటి సమయంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉండటం తన అదృష్టం గా చెబుతూ ఎమోషనల్ అయ్యారు. దేశ ప్రధాని స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విషయంగా పేర్కొన్నారు.

ప్రధాని - సీఎంతో కలిసి వేదిక పై
రాష్ట్ర ప్రభుత్వ చొరవతో అల్లూరి 125 వ జయంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని వివరించారు. చంద్రబాబు పార్లమెంట్ లో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయాలంటూ లేఖ రాయటం పైనా రోజా స్పందించారు. ఇప్పుడు కేంద్రానికి లేఖలు రాస్తున్నారంటూ ఎద్దేవా చేసారు. తాను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ రోజూ కనీసం ఒక ఊరికి కూడా అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలన్న ఆలోచన చేయలేదని దుయ్య బట్టారు. అధికారంలో ఉన్నప్పుడు అశోక్ గజపతి రాజు, అధికారం లేనప్పుడు అల్లూరి సీతారామరాజు చంద్రబాబుకు గుర్తుకు వస్తారంటూ సెటైర్ వేసారు.

చిరుకు ఓకే - పవన్ కు అర్హత లేదు
ప్రధానితో పాటు వేదిక పంచుకోవటానికి పవన్ కళ్యాణ్ కు ఎలాంటి అర్హత లేదంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర మాజీ మంత్రిగా.. మొగల్తూరు లో పుట్టిన బిడ్డగా ఆ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమంలో చిరంజీవి పాల్గొంటున్నారని వివరించారు. చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందిందన్నారు. పవన్ చెప్పుకోవటమే కానీ, ఎటువంటి ఆహ్వానం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టి గౌరవించుకుందని వివరించారు.












Click it and Unblock the Notifications