సీఎం జగన్ అరెస్టు ఖాయం.. సంకెళ్లతో రస్ అల్ ఖైమా సిద్ధం.. అందుకే కాళ్లబేరాలన్న నిమ్మల
వాన్ పిక్ భూముల కుంభకోణం కేసులో ఏపీ సీఎం జగన్ ను అరెస్టు దాదాపు ఖాయమైందని, వాన్ పిక్ లో పెట్టుబడులు పెట్టిన రస్ అల్ ఖైమా(యూఏఈలోని ఏడు రాజప్రసాల్లో ఒకటి) ఇప్పటికే సంకెళ్లతో సిద్ధంగా ఉందని, ఏ3 నిమ్మగడ్డ ప్రసాద్(మ్యాట్రిక్స్ ప్రసాద్)ను అదుపులోకి తీసుకున్న అల్ ఖైమా ప్రభుత్వం.. జగన్ అరెస్టుపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, అందుకే ఏపీ సీఎం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి మోదీతో కాళ్లబేరం చేసుకుంటున్నారని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించన వివరాల్ని ప్రభుత్వం వెల్లడించకపోవడానికి ముఖ్యకారణం కూడా ఇదేనని, అయితే ప్రజలకు మాత్రం జగన్ రహస్యాలన్నీ తెలిసిపోయి ఛీకొడుతున్నారని నిమ్మల అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ అరెస్టు కాబోతుండటానికి దారితీసిన పరిణామాలను పూసగుచ్చినట్లు చెప్పారు.

అసలేం జరిగిందంటే..
‘‘రస్ అల్ ఖైమా పాలకులు.. భారత ప్రభుత్వానికి రాసిన లేఖతో సీఎం జగన్ నెట్ వర్క్ మొత్తం క్రాష్ అయింది. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు.. మ్యాట్రిక్స్ ప్రసాద్ గా పిలువబడే నిమ్మగడ్డ ప్రసాద్(49 శాతం వాటా).. రస్ అల్ ఖైమా(51 శాతం వాటా)తోకలిసి ఏపీలో వాన్ పిక్ ప్రాజెక్టును జాయింట్ వెంచర్ గా తలపెట్టారు. ఈ మేరకు వైఎస్సార్ ప్రభుత్వం వాన్ పిక్ కు 16వేల ఎకరాలు కేటాయించింది. ఆ వెంటనే నిమ్మగడ్డ.. రూ. 854కోట్లను జగన్ తరఫు కంపెనీలకు క్విడ్ ప్రోకోగా సమర్పించుకున్నారు. ప్రాజెక్టు పని ఎంతకీ మొదలు కాకపోవడంతో తాము మోసపోయినట్లు రస్ అల్ ఖైమా గుర్తించింది. అక్కడి ప్రభుత్వం చర్యలకు దిగింది...

జగన్ ఢిల్లీకి ఎందుకెళ్లారంటే..
వాన్ పిక్ లో తమచేత పెట్టుబడులు పెట్టించిన నిమ్మగడ్డ ప్రసాద్ ను రస్ అల్ ఖైమా ప్రభుత్వం.. గతేడాది సెర్బియాలో అదుపులోకి తీసుకుంది. విచారణలో నిమ్మగడ్డ నిజాల్ని కక్కడంతో అక్కడి ప్రభుత్వం ఇటీవలే భారత ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఇండియాలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని విదేశీ పోలీసులు అరెస్టు చేస్తే దేశం పరువు మంటగలిసిపోతుంది. విషయం తెలుసుకున్న వెంటనే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దల కాళ్లుపట్టుకున్నారు. అవసరమైతే వైసీపీ కోటా నుంచి రాజ్యసభ ఎంపీలుగా బీజేపీ నేతల్ని పంపుతానని వాగ్ధానం చేశారు. అలాగే ఏపీ ప్రజలకు హక్కుగా రావాల్సిన అన్ని ప్రయోజనాలను జగన్ తాకట్టుపెట్టారు'' అని నిమ్మల రామానాయుడు వివరించారు.

నేరస్తుడి నీడలో బతుకుతూ..
విదేశీ ప్రభుత్వాలను సైతం బురిడీ కొట్టించిన ఘరానా నేరస్తుడు వైఎస్ జగన్ అని, అలాంటి వ్యక్తి నీడలో బతుకుతోన్న వైసీపీ నేతలు ఇవాళ చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉందని రామానాయుడు అన్నారు. గడచిన ఎనిమిదేళ్ల నుంచి తన ఆస్తులు, కుటుంబం ఆస్తుల్ని వెల్లడిస్తోన్న ఏకైక నేత దేశంలో చంద్రబాబు ఒక్కరేనని, టీడీపీ అధినేతకు కూడా అవినీతి బురద అంటించడానికి సీఎం జగన్ చాలా తాపత్రయపడుతున్నారని నిమ్మల ఎద్దేవా చేశారు.
Recommended Video


బస్సు యాత్రతో వైసీపీకి వణుకు..
ప్రజా చైతన్య యాత్ర పేరుతో చంద్రబాబు చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతుండటం వైసీపీకి మింగుడుపడట్లేదని, అందుకే మంత్రులు, నేతలు ఇష్టమొచ్చినట్లుగా టీడీపీ, చంద్రబాబులపై నోరు పారేసుకుంటున్నారని నిమ్మల అన్నారు. గతంలో రావాలి జగన్ అన్న ప్రజలే, ఇప్పుడు పోవాలి జగన్ అంటూ, చంద్రబాబు వెంట నడుస్తుండటంతో వైసీపీ వెన్నులో వణుకు మొదలైందన్నారు. రస్ అల్ ఖైమా లేఖ, ఢిల్లీలో జగన్ పర్యటనకు సంబంధించిన వివరాల్ని రెండు ప్రభుత్వాలు వెంటనే బయటపెట్టాలని రామానాయుడు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications