మాన్సాస్ ఛైర్మన్గా మళ్లీ అశోక్ ? దోపిడీ కోసమే సంచైత- రఘురామరాజు సంచలనం..
వైసీపీ తరఫున ఎన్నికల్లో గెలిచి ఆ పార్టీపైనే నిత్యం విమర్శలకు దిగుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ మరో సంచలనానికి తెరదీశారు. ఈసారి విజయనగరంలోని మాన్సాస్ ట్రస్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా మాన్సాస్ ట్రస్టు మాజీ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుతో పాటు ఆయన అన్న కూతురు, ప్రస్తుత ఛైర్ పర్సన్ సంచయిత గజపతిరాజుపై రఘురామరాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మాన్సాస్ ఛైర్మన్గా అశోక్ గజపతిరాజు తిరిగి వస్తారంటూ తనకు నమ్మకం ఉందంటూ రఘరామ చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో సంతోషాన్ని నింపాయి.

మాన్సాస్ వ్యవహారాలపై రఘురామ ఫైర్...
విజయనగరంలోని పూసపాటి రాజవంశీయులకు చెందిన మాన్సాస్ ట్రస్టులో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘరామరాజు స్పందించారు. 300 ఏళ్ల చరిత్ర కలిగిన మాన్సాస్లో పరిణామాలు తనకు బాధ కలిగిస్తున్నాయని రఘురామ తెలిపారు. 17వ శతాబ్దం నుంచి విశాఖ అంతా అశోకగజపతిరాజు కుటుంబ సభ్యుల పాలనలో ఉందన్నారు. మూడు శతాబ్దాలుగా మాన్సాస్ అశోక్ కుటుంబం చేతుల్లోనే ఉందన్నారు. కానీ ఇప్పుడు ఆకస్మికంగా సంచైతను తెరపైకి తీసుకొచ్చారని రఘురామ ఆక్షేపించారు. దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోందన్నారు.

మాన్సాస్ ఛైర్మన్గా తిరిగి అశోక్..
మాన్సాస్ ట్రస్టుకు వంశపారంపర్య ఛైర్మన్గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించడం దురదృష్టకరమని రఘురామ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మచ్చలేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అశోక్ గజపతిరాజు మాత్రమేనన్నారు. ఇప్పటివరకూ ఆ కుటుంబంలోని పురుషులే మాన్సాస్ ట్రస్టుకు నాయకత్వం వహిస్తున్నారని, అలాంటి వ్యక్తిని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. అర్ధరాత్రి జీవోలతో సంచయితను నియమించారని, కానీ కోర్టు తిరిగి అశోక్ గజపతిరాజును ఛైర్మన్గా నియమిస్తుందనే నమ్మకం తనకుందని రఘురామ తెలిపారు.
సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ప్రభుత్వ జోక్యం చేసుకోకుండా ఆ కుటుంబానికే వదిలేస్తే మంచిదని హితవుపలికారు.
సీఎం జగన్కు తెలియకుండా కొందరు కుట్రలు చేస్తున్నారంటూ రఘురామ మండిపడ్డారు.

సంచయిత నియామకంపై సర్వే...
మాన్సాస్ ఛైర్మన్ పదవి విషయంలో సంచయిత వాదన ప్రకారం స్త్రీ, పురుషులు సమానమే కానీ వంశ పారంపర్యంగా వస్తున్న ఆనవాయితీని తొలగించడం సరికాదని రఘురామ తెలిపారు. ఏ ఉద్దేశంతో సంచయిత గజపతిరాజును తెరపైకి తెచ్చారో అంటూ రఘురామ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సింహాచలం దేవస్ధానం ఆధీనంలో ఉండాల్సిన భూములు అన్యాక్రాంతమయ్యాయని, దేవస్ధానంలో పనిచేస్తున్న నిజాయితీ గల అధికారి భ్రమరాంబ ఉద్యోగం చేయలేనంటూ వెళ్లిపోయారని రఘురామ గుర్తు చేశారు. సింహాచలం దేవస్థానంలో ఇప్పుడు జరగబోయే దోపిడీని ఆపాలని అన్నారు. కార్తీక్ అనే వ్యక్తిని ఓఎస్టీగా నియమించడం చెల్లదన్నారు.
ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా సంచయిత ను చైర్మన్గా నియమించారని, అశోకగజపతి రాజును తొలగించి సంచయిత గజపతిరాజుని నియమిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఒక సర్వే చేస్తే ప్రజల మనోగతం ఏంటి అనేది తెలుస్తుందని రఘురామరాజు సూచించారు.
Recommended Video

సింహాచలం భూముల కోసం కుట్ర...
రాజధాని అమరావతి నుంచి విశాఖ వెళ్తుందని తాను అనుకోవడం లేదని రఘురామ తెలిపారు. అయినా రాజధాని తరలింపు ప్రయత్నాల నేపథ్యంలో సింహాచలం భూముల్లో పెద్ద స్కాం జరుగుతోందని, ఎంతోమంది హిరణ్యకశిపులు విశాఖ వస్తున్నారన్నారు. విశాఖ వాసులు నరసింహస్వామి ఆస్తులను కాపాడుకోవాలని శపథం చేయాలని రఘురామ సూచించారు. సింహాచలం భూముల్లో చాలామటుకు అన్యాక్రాంతం అయ్యాయని, మిగిలిన వాటినైనా కాపాడుకోవాల్సి ఉందన్నారు. సింహాచలం దేవస్ధానంతో పాటు మాన్సాస్కు ఓ చరిత్ర ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications