WTC Final Date And Timings: కంప్లీట్ షెడ్యూల్ ఇదే..నిద్రకు దూరం కావాల్సిందే
లండన్: టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయంగా ఆవిర్భవించనున్న ప్రతిష్ఠాత్మక ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ (WTC final) సరిగ్గా వారం రోజుల్లో ఆరంభం కానుంది. వచ్చే శుక్రవారం ఈ పాటికి టాస్ కూడా పడిపోయి ఉంటుంది. ఇన్నింగ్ ఎవరు ప్రారంభిస్తారో తేలిపోయి ఉంటుంది. ఈ టైటిల్ కోసం ఈ 18వ తేదీన ఇంగ్లాండ్ సౌథాంప్టన్లోని రోజ్ బౌల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ తలపడబోతోన్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు టాస్ వేస్తారు. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయర్లు ఇప్పటికే సౌథాంప్టన్ చేరుకున్నారు. న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది.
ఇండియన్ టైమింగ్స్ ఇవే
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమౌతుంది. 2-2:30 మధ్య టాస్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఒక్కో ఇన్నింగ్కు ఎనిమిది గంటలు లెక్కేసుకున్నా గానీ ఒక రోజు మ్యాచ్ ముగిసేసరికి రాత్రి 11:30 గంటలు దాటొచ్చు. మ్యాచ్ మొత్తాన్నీ చూడాలంటే కొంత నిద్రకు దూరం కావాల్సి వస్తుంది క్రికెట్ ప్రేమికులకు. ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్షప్రసారం చేస్తుంది. దీనికి సంబంధించిన స్పాన్సర్షిప్ను ఆ ఛానల్ ఇప్పటికే దక్కించుకుంది కూడా. ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో లైవ్ కామెంటరీ వినొచ్చు. డీస్నీ ప్లస్ హాట్ స్టార్లోనూ ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించవచ్చు.
కామెంటేటర్గా దినేష్ కార్తిక్ డెబ్యూ..
ఈ మ్యాచ్లో న్యూట్రల్ కామెంటేటర్గా వ్యవహరించే ఛాన్స్ దినేష్ కార్తీక్కు దక్కింది. లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్తో కలిసి ఆయన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు వ్యాఖ్యాతగా ఎంపికయ్యాడు. కామెంటరీ చేయడం దినేష్ కార్తీక్కు ఇదే తొలిసారి. ఫైనల్లో ఆడబోతోన్న భారత్, న్యూజీలాండ్, దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోన్నందున ఇంగ్లాండ్ నుంచి కామెంటేటర్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎంపిక చేయనుంది. న్యూజీలాండ్ నుంచి సైమన్ డౌల్ పేరు ఖరారైంది. ఈ మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న ఇంగ్లాండ్ తరఫున ఆ దేశ మాజీ క్రికెటర్లు నాజిర్ హుస్సేన్, మైక్ అథర్టన్లను తీసుకున్నారు.
అంపైర్లు వీరే..
ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్కు ఇంగ్లాండ్కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్వర్త్, మైఖెల్ గాఫ్ ఆన్ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ క్రిస్ బ్రాడ్ ఐసీసీ మ్యాచ్ రెఫరీగా ఎన్నికయ్యాడు. అలాగే- రిచర్డ్ కెటెల్బోరో అంపైర్ల ఎలైట్ ప్యానెల్కు ఎంపికయ్యాడు. టీవీ అంపైర్గా వ్యవహరిస్తాడతను. అలెక్స్ వార్ఫ్ ఫోర్త్ అంపైర్గా ఉంటారు. ఇవన్నీ కుదిరేశాయి. ఇక మ్యాచ్ ఆరంభం కావడం ఒక్కటే మిగిలి ఉంది. దీనికోసం ఇంకో వారం రోజుల పాటు ఎదురు చూడక తప్పట్లేదు.