టిడిపి మైండ్ గేమ్: వైసిపిలో మిగిలేది జగన్ ఒక్కరేనా?
గుంటూరు/ విజయవాడ: రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో మిగిలేది ఆ పార్టీ అధినేత జగన్ ఒక్కడేనని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్ మీద విశ్వాసం లేకనే ఎమ్మెల్యేలు, నాయకులు బయటకు వెళ్తున్నారని ఆయన అన్నారు. గుంటూరు ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.
అంబేద్కర్ జయంతిని కూడా జగన్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలకు వైఎస్ రాజశేఖర్రెడ్డి తెరతీసినట్లు చెప్పారు. విభజన తరువాత లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్ర అభివృద్థికి ప్రతిపక్షం కూడా సహకరించాలన్నారు.

కేవలం అధికారం కోసం పాకులాడుతూ ప్రభుత్వాన్ని ఆస్థిరపాలు చేయాలని జగన్ భావించటం వల్లే ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వెళుతున్నట్లు తెలిపారు. ముఖ్య మంత్రి చంద్రబాబు పనితీరు బాగుందని, లోటు బడ్జెట్ ఉన్నా అభివృద్థిలో రాష్ట్రం వెనుకబడలేదని మంత్రి పుల్లారావు అన్నారు.
రాష్ట్రంలో మే నాటికి వైయస్సార్ కాంగ్రెసు దుకాణం ఖాళీ అవుతుందని, ఏపీలో తెలుగుదేశం పార్టీ అతిపెద్ద సింగిల్ పార్టీగా అవతరిస్తుందని విజయవాడ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను తాము కొనుగోలు చేస్తున్నామని, రకారకాలుగా ప్రలోభా లు పెడుతున్నామని, జగన్, విజయసాయిరెడ్డి, రామచంద్రారెడ్డి వంటి వారుచేసే ఆరోపణలు, విమర్శల్లో ఇసుమంతైనా వాస్తవం లేదన్నారు.
బొబ్బిలి రాజవంశీకుడైన సుజన కృష్ణరంగారావును కొనుగోలు చేసే శక్తి టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. లక్ష కోట్ల అవినీతి సొమ్ముతో జగనమోహనరెడ్డి బెంగళూరులో రాజ ప్రసాదం నిర్మించుకుంటే తాతా ముత్తాతల నుంచే కోటలు కలిగి ఉన్న సుజన కృష్ణా రంగారావును కొనుగోలు చేసే శక్తి టీడీపీకి లేదన్నారు.
బొత్స సత్యనారాయణను పార్టీలోకి తీసుకున్నందు వల్ల, వైసీపీ విధానాలు నచ్చక పోవడం వల్ల సుజన కృష్ణ టీడీపీలోకి వస్తున్నారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేయటం, ప్రలోభాలకు గురిచేయాల్సిన అవసరం తమ పార్టీకి లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications