అమెరికా సిలికాన్ వ్యాలీలో సమైక్యాంధ్ర గళం
ఈ సభలో సమైకాంధ్రప్రదేశ్పై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భక్త భల్లా, చైతన్యరెడ్డి, వెంకట్ మద్దిపాటి, శ్రీనివాస్ వేముల, సతీష్ అంబటి, తులసి తుమ్మల శ్రీకాంత్ కోనేరు తదితరులు నిర్వహించిన ఈ సభలో రాజకీయ అవకాశవాదాన్ని ఆసరాగా తీసుకుని తెలుగు వారి మధ్య విభేదాలు సృష్టిస్తున్నారనీ పలువురు వక్తలు ఆవేశంగా ప్రసంగించారు.
వెనుకబాటు తనానికి వేర్పాటు వాదాలు పరిష్కారం కాదనీ, అవి అభివృద్ది వైపు తీసుకెళ్ళలేవని ఆవేదనతో అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే తెలుగు వారి ప్రగతే ముక్కలైపోతుందని అన్నారు. సమైకంగా ఉంటేనే అభివృద్ది సాధించడం సులభతరం అవుతుందన్న అభిప్రాయాలను వ్యక్తీకరించారు.
ఐటి రంగంలో హైదరాబాద్ ఎంతో ప్రగతి సాధించిందనీ, ఆ విజయం తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల వారందరిదీనని గుర్తు చేశారు. ఎవరినీ సంప్రదించకుండా, ఆఖరికి ముఖ్యమంత్రికి కూడా తెలియకుండా చేసిన తెలంగాణ ప్రత్యేక ప్రకటన, అదీ అర్ధరాత్రి హడావుడిగా నిర్ణయాన్ని ప్రకటించడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే అభివృద్ది కుంటుపడుతుందని మరికొందరు వక్తలు ప్రసంగించారు.