ఆస్ట్రేలియాలో సమైక్యవాదుల ఘంటారావం
ఈ కార్యక్రమానికి శ్రీమతి అరుణ చంద్రాల అధ్యక్షత వహించి ప్రారంభోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆవిర్భావం గురించి అరుణ చంద్రాల సోదాహరణంగా వివరించారు. అనంతరం అరుణ చంద్రాల ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. తర్వాత సుందరం రాచకొండ, శ్రీమతి లత పరమాత్ముని, మల్లిక్ రాచకొండ, సుబ్బారావు వరిగొండ తదితరులు మాట్లాడారు. మధ్యలో శ్రీమతి రాజా తల్లాప్రగడ సమైక్యాంధ్రను కోరుకుంటూ ఆమె రచించిన గేయాన్ని పాడి వినిపించారు.
ఆ తర్వాత మాట్లాడిన కోడూరి శ్యాం ప్రసాద్ తెలుగు ప్రజలంతా సమైక్యంగా ఉంటేనే గణనీయ మైన అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. యూరోపియన్ యూనియన్, జర్మనీ లాగా అభివృద్ధి చెందాలంటే కలిసి వుంటేనే సాధ్యమవుతుందని కోడూరి శ్యాం ప్రసాద్ వివరించారు. తెలుగు ఎన్నారైలంతా విదేశాలలో నాన్ లోకల్స్గా వుంటూ అక్కడ అన్ని అవకాశాలను, సమాన హోదాను పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలంగాణకు మద్దతు పలుకుతున్న తెలుగు వారందరూ ప్రత్యేకించి విదేశాలలో ఉంటున్న తెలంగాణ వాదులందరూ గమనించాలన్నారు.
ఆ తర్వాత బొబ్బ ప్రకాష్, కంచెర్ల ప్రసాద్, విద్యార్ధులు మిదిలేష్ రాజు, ప్రవీణ్ రెడ్డి సమైక్యాంధ్రపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రయత్నాలు మానుకోవాల ని, లేకుంటే ప్రపంచ వ్యాప్తంగా వున్న సమైక్యవాద ప్రవాసాంధ్రులతో చర్చించి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని కార్యక్రమ నిర్వాహకులు హెచ్చరించారు. కంచెర్ల ప్రసాద్, బొబ్బ ప్రకాష్, కోడూరి శ్యాం ప్రసాద్, మురళి గంటి, గద్దె సతీష్ల ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహణ జరిగింది.