నోబెల్ రేసులో నెల్లూరు తెలుగు తేజం
శాంతి పురస్కారానికి పరిశీలనలో ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్క్లింటన్ వంటి వారితో కూడిన జాబితాలో ఎంఎస్ రెడ్డి పేరు ఉంది. ఆయన పూర్తి పేరు మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. ఎంఎస్ రెడ్డి పరిశోధనలవల్ల ఆహార ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, ప్రపంచంలో ఆకలి బాధను తగ్గించడంలో ఆయన విశేష కృషి చేశారని ఆ సంస్థలు పేర్కొన్నాయి. అనేక వ్యాధుల నిర్మూలనకు ఆయన పరిశోధనలు ఉపయోగపడ్డాయని, ఆయన అభివృద్ధి పరచిన అప్లికేషన్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లక్ష కోట్ల డాలర్ల ఆదాయం సమకూరిందని పేర్కొన్నాయి.
పేదల కోసం వందల కోట్ల డాలర్లు ఖర్చుచేస్తూ ఎంఎస్ రెడ్డి అనేక సేవా కార్యక్రమాలకు చేయూతను అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ దృష్టికి తీసుకొచ్చాయి. ఎంఎస్ రెడ్డి తిరుపతిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత అమెరికాలోని ఐవా స్టేట్ విశ్వవిద్యాలయం నుంచి ఫుడ్ టెక్నాలజీ, మైక్రో బయాలజీలో ఎంఎస్, పిహెచ్డి చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 అంతర్జాతీయ సంస్థలకు టెక్నికల్ కన్సల్టెంట్గా పనిచేసి ఉత్తమ శాస్త్రవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని డైరీ, ఫుడ్ కన్సల్టింగ్ లేబొరేటరీ సంస్థ (అడ్ఫాక్ ల్యాబ్స్) చైర్మన్గా ఉన్నారు.
వందకు పైగా అంతర్జాతీయ అవార్డులు ఆయనను వరించాయి. అమెరికా ఉపాధ్యక్షుడు, భారత ప్రధాని చేతుల మీదుగా కూడా ఆయన పురస్కారాలు అందుకున్న సందర్భాలున్నాయి. దాదాపు 150 అంతర్జాతీయ పేటెంట్లు ఆయన సొంతం. శాస్త్రీయ పరిశోధనలపై ఎంఎస్ రెడ్డి రాసిన పలు ఆర్టికల్స్ వివిధ సైన్స్ మేగజైన్లలో ప్రచురితమయ్యాయి. కీస్ టు విన్నింగ్, ఎ టు జెడ్ ఆఫ్ సక్సెస్ వంటి పుస్తకాలను ఆయన రచించారు.