ధోతీ కట్టుకున్న పాపానికి..
దుబాయ్: తన సంప్రదాయ వస్త్రధారణ ధోతీతో 67 ఏళ్ల భారతీయుడిని దుబాయ్ మెట్రోలోకి ఎక్కనీయలేదు. ఇతిసలాట్ మెట్రో స్టేషన్ పంచింగ్ గేట్ల వద్ద ఓ పోలీసు తమను నిలిపేశాడని, తన తండ్రి వస్త్రధారణకు అనుమతి లేదని చెప్పాడని, ధోతీ ధరించి మెట్రోలో ప్రయాణం చేయడానికి వీలు లేదని చెప్పాడని ఆ భారతీయుడి కూతురు మధుమతి చెప్పింది. ఈ సంఘటన శనివారంనాడు జరిగింది.
తమను అనుమతించాలని తాను విజ్ఞప్తి చేశానని, అయితే పోలీసు తమ విజ్ఞప్తిని వినలేదని, దాంతో తన తండ్రి తీవ్ర నిరాశకు గురయ్యాడని, ఈ సంఘటన తమను తీవ్రమైన ఇబ్బందికి గురి చేసిందని ఆమె అన్నారు. గల్ఫ్ న్యూస్తో ఆమె ఈ విషయం చెప్పింది.
ధోతీ భారత సంప్రదాయ వస్త్రధారణ అని, అది శరీరాన్ని మొత్తం కప్పి ఉంచుతుందని తాను చెప్పినా పోలీసు వినలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి దుబాయ్ సందర్శనకు వచ్చాడని, మెట్రోలో ఇంతకు ముందు ధోతీ ధరించే ప్రయాణించాడని, తమకు ఏ విధమైన ఆటంకాలు ఎదురు కాలేదని ఆమె చెప్పారు.
అధికారిక వస్త్రధారణ నియమాలు గానీ విధానం గానీ ఏమీ లేదని రోడ్లు, రవాణా అథారిటీ స్పష్టం చేసింది. ఆర్టిఎ ఏ విధమైన ఆంక్షలు విధించనప్పటికీ ఓ పోలీసు ఆ విధంగా వ్యవహరించడం ఆశ్చర్యకరమని ఆర్టిఎ రైలు ఏజెన్సీ ఆపరేషన్స్ డైరెక్టర్ రామదాన్ అబ్దుల్లా అన్నారు. శరీరాన్ని కప్పి పెట్టి, హుందాగా ఉండే ఏ విధమైన వస్త్రధారణకైనా అనుమతి ఉందని, పోలీసు వ్యక్తిగతంగా ప్రతిస్పందించాడని, దీనిపై దర్యాప్తు చేస్తామని చెప్పారు.