షాకింగ్ రిపోర్ట్ : దేశంలో సగానికి పైగా ఫేక్ డాక్టర్లే..
న్యూఢిల్లీ : లక్షలకు లక్షలు డబ్బులు చెల్లించి జబ్బులు నయం అవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న రోగులకు ఇదో పెద్ద షాక్. ఎందుకంటే.. రోగుల కంటే ముందు వైద్య వ్యవస్థకే ట్రీట్ మెంట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో డాక్టరంటే భరోసా కు కేరాఫ్ అనుకునే సామాన్యుల నమ్మకం కాస్త అనుమానానికి కేరాఫ్ గా మారిపోతుంది.
అవును.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (who-world health organisation)చెబుతోన్న వివరాలను పరిశీలిస్తే.. అసలు మనకు ట్రీట్ మెంట్ చేస్తున్నది నిజమైన వైద్యుడేనా..? అన్న సందేహం తలెత్తకమానదు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నివేదికలో దేశ మెడికల్ వ్యవస్థకు సంబంధించి నివ్వెరపోయే విషయాలు బయటపడ్డాయి. సంస్థ చెబుతున్న వివరాల ప్రకారం.. దేశంలో సగం మంది డాక్టర్లు సర్టిఫికెట్ లేకుండానే ట్రీట్ మెంట్లు చేసేస్తున్నారు.
నివేదిక ప్రకారం.. దేశంలో ఉన్న వైద్యుల్లో 77.2 శాతం మంది అలోపతి వైద్యులు కాగా, 22.8 శాతం మంది హోమియో ఆయుర్వేద యునానీ వైద్యులు. అయితే ఆందోళన కలిగిస్తోన్న విషయమేంటంటే.. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం అలోపతి డాక్టర్లలో 57.3 శాతం మంది వైద్యులు మెడికల్ డిగ్రీలే లేకుండా వైద్యం చేసేస్తున్నారట.
ఇక 31.4 శాతం మంది వైద్యులు సెకండరీ స్కూల్ విద్యతోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి డాక్టర్ల అవతారం ఎత్తారట. ఇక నర్సుల విషయానికొస్తే.. దేశంలోని 73 జిల్లాల్లో సరైన అర్హతలున్న నర్సులు ఒక్కరు కూడా లేరట. దేశంలో నర్సులుగా చలామణి అవుతోన్న వాళ్లలో 67.1 శాతం మంది విద్యార్హత కేవలం సెకండరీ విద్య మాత్రమే అని తేల్చింది.
ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. దేశంలో అత్యవసరంగా వైద్య సంస్కరణలు చేపట్టాలని హెచ్చరించింది. 2001 జనాభాల లెక్కల ప్రకారం దేశ జనాభా 102 కోట్లు అయితే, వైద్య వృత్తిలో ఉన్నవారు కేవలం 20 లక్షలు మాత్రమేనని పేర్కొంది. ఇందులో 39.6 శాతం మంది వైద్యులని, 30.5 శాతం మంది మిడ్ వైఫ్ లని, కేవలం 1.2 శాతం మంది మాత్రమే డెంటిస్టులని తెలిపింది.
అయితే అర్హతల విషయంలో పురుష వైద్యుల కంటే మహిళా వైద్యులే సరైన అర్హతలు కలిగి ఉన్నట్లుగా నివేదికలో వెల్లడయింది. దేశంలో కేవలం 37.7 శాతం మంది పురుషులకే సరైన విద్యార్హతలుండగా, మహిళల్లో 67.2 శాతం మంది తగిన అర్హతలు కలిగి ఉన్నట్లుగా పేర్కొంది. ఇక ఈశాన్య రాష్ట్రాలతో సహా యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వైద్యులు సంఖ్య తక్కువగా ఉన్నట్లు నివేదికలో స్పష్టమైంది.