సాహిత్య సదస్సులో సత్యం మందపాటి
అట్లాంటా: ఎన్నారైల మీద హాస్యంతో కూడిన రచనలు చేయడంలో ప్రసిద్ధులైన సత్యం మందపాటితో ఆట్లాంటాలో ఈ నెల 16వ తేదీన తామా సాహిత్య సదస్సును ఏర్పాటు చేసింది. ఎన్నారైలపై హాస్యంతో కూడిన రచనలు చేయడంలో సత్యం మందపాటి ప్రసిద్ధులు. తెలుగు ఆసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామా) తామా సాహిత్య కార్యదర్శి మురళీ కాకుమాని స్వాగతంతో కార్యక్రమం ప్రారంభమైంది.
చిరంజీవి మనోమాయే సాయి మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే గీతాన్ని ఆలపించారు. సత్యం మందపాటిని మురళి వేదిక మీదికి ఆహ్వానించారు. సత్యం మందపాటి గురించి ఆయన వివరించారు. అట్లాంటా హాస్య రచయిత ఫణి డొక్కాను కూడా వేదిక మీదికి ఆహ్వానించారు
రచనలు చేయడంలో సత్యం మందపాటి నిబద్ధత గురించి డొక్కా వివరించారు. సత్యం పేరులో ఏముంది అనే కథను మాధవ్ దుర్భ చదివి పేరులో చాలా ఉందని చెప్పారు. శ్యాం ఎల్లమరాజు సత్యం మందపాటి హాస్య కథను చదివి వినిపించారు. సత్యం నూతన రచన అమెరికా వంటింటి పద్యాల నుంచి కొన్ని పద్యాలను సంధ్యా ఎల్లాప్రగడ చదివి వినిపించారు.
ఎన్నారైలుగా వస్తున్నవారికి అమెరికాలోని పరిస్థితులు, ఇక్కడ మసులుకోవాల్సిన విధివిధానాల గురించి సహాయకారిగా ఉండడానికి తన రచనలు సహాయపడాలనే ఉద్దేశంతో తాను రచనలు చేశానని సత్యం మందపాటి వివరించారు. తామా కార్యవర్గం సత్యం మందపాటికి శాలువను, జ్ఞాపికను బహూకరించారు.