కవిత్వం సామాజిక వ్యాఖ్యానం: శ్రీనివాస్
హైదరాబాద్: సామాజిక వ్యాఖ్యానమే కవిత్వమని, 'ఇడుపు కాయితం'లోనూ అటువంటి వ్యాఖ్యానమే కనిపిస్తుందని ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ కాసుల లింగారెడ్డి రచించిన ఇడుపు కాయితం కవితా సంపుటిని హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఆదివారం సాయంత్రం ఆయన ఆవిష్కరించారు. ప్రాంతాల మధ్య సంబంధాలను మానవ సంబంధాలతో పోల్చడం చరిత్రలో కనిపిస్తుందని కె. శ్రీనివాస్ అన్నారు. జాతుల మధ్య విడిపోయే హక్కు ఉంటుందని, తెలంగాణ విముక్తి కూడా అలాంటి ఆకాంక్షే అన్నారు.
లింగారెడ్డి కవిత్వంలో సామాజిక , వ్యక్తిగత కవిత్వం రెండూ కనిపిస్తాయని అభిప్రాయపడ్డారు. సంశయంలోనుంచి వ్యక్తిగత కవిత్వం, ఆశావాదంలోనుంచి సామాజిక కవిత్వం వస్తుందన్నారు. లింగారెడ్డి వ్యక్తిగత కవిత్వం సైతం సామాజిక వాస్తవికతకు దర్పణం పడుతోందన్నారు. తెలంగాణ అనేది పాటకు అనుగుణమైన వాదమని, తెలంగాణ వాదాన్ని పాట ప్రకటించినంత ప్రస్పుటంగా కవిత్వం ప్రకటించలేదని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కవులు, రచయితలు, బుద్ధిజీవుల పాత్ర గణణీయమైందని, వాళ్లు లేకుండా తెలంగాణ సాధ్యమయ్యేది కాదని నమస్తే తెలంగాణ సంపాడకుడు అల్లం నారాయణ అన్నారు. వైభవోపేతమైన చరిత్రగల తెలంగాణ ఉద్యమం ఎన్నో పరీక్షలను ఎదుర్కొని రాజ్యాంగ ప్రక్రియ ద్వారా రాష్ట్రాన్ని సాధించుకుందన్నారు. తెలంగాణ పోరాటం స్వాతంత్య్ర పోరాటానికంటే గొప్పదని, సమరశీల పోరాటాలు సాగిస్తూనే పరిమితులకు లోబడి వ్యవహరించిందన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు రాకపోయినా రాష్ట్రం ఆగేదికాదన్నారు. ఇంకా చేయాల్సిన పోరాటం మిగిలే ఉందని, సమైక్య వాద ప్రతీకల్ని కూల్చి కొత్త ప్రతీకల్ని నిర్మించాలని అన్నారు.
ఇడుపు కాయితంలో అద్భుతమైన రూపంతో కూడిన బహుముఖ కవిత్వం కనిపిస్తోందని ప్రముఖ కవి, విమర్శకుడు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ క్రమాన్ని, విధ్వంస చిత్రాన్ని ఈ కవిత్వంలో చిత్రించాడని అన్నారు. స్థానికత నుంచి అంతర్జాతీయత వరకు ఆయన కవిత్వంలో ఒదిగిపోయాయన్నారు.
ఒక నిర్బంధ కాలంలో కవులు, కళాకారులకు తెలంగాణ ఉద్యమం కొత్త వేదికనిచ్చిందన్నారు. స్థిరపడిన ప్రతీకల్ని ధ్వంసం చేయడంతో పాటు, ప్రశ్నించే తత్వం తెలంగాణ సాహిత్యంలో కనిపిస్తోందని ప్రముఖ కవి నారాయణ స్వామి అన్నారు. తెలంగాణ సాహిత్యం కొత్త నుడికారాలతో ప్రపంచ సాహిత్యానికి తీసిపోని స్థాయిలో వస్తోందన్నారు. సభాధ్యక్షత వహించిన ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి కవులు, సాహితీవేత్తలు, బుద్ధిజీవులే తాత్విక భూమికని అందిచారని అన్నారు.