సంచీలో దీపం - హిమజ
'' ఓ నాలుగు వాక్యాలు/ ఎక్కడో దాక్కునేవుంటాయి/మన కంటబడి ఓదార్పునివ్వడానికి, మనలో స్థైర్యం నింపడానికి/ మనకోసమే వేచి ఉంటాయి '' నిజమే ఈ కవిత్వం అలాంటిదే '' అనే పదాలతో ''సంచీలో దీపం సంకలనం '' అట్టవెనుక ఉటంకించి నట్లు చెప్పిన నిజాయితీపూరిత ప్రకటనలో వాస్తవం లేకపోలేదు. అందుకే ఈ పుస్తకంలో ఏముందో, సంచీలో దీపం మతలబు యేమిటో కాస్త తడుముదాం. పూర్తిగా విశ్లేషించడానికి సమయం సరిపోదు. స్థాలీపులాక న్యాయంగా, అన్నం వుడికిందో లేదో తెలుసుకుంటాని మెతుకును తడిమినట్టు నేనూ ఆ అనుభవాన్ని పొందాను. పక్వమైన కవితా భోజనమే రుచుంచేలాగ '' హిమజ '' అందించారు. ఆ మాత్రం ధృవపత్రం సరిపోదు. అందుకే కొన్ని కవితా పాదాల సవ్వడి యెలా వుందో తెలుసుకుందాం.
సహజంగానే రచయిత్రి స్త్రీ కావటంతో కనీస మర్యాదగా స్త్రీలని గౌరవించాలనుకుందేమో ఇంట గెలిచి రచ్చ గెలవాలవాలన్నట్టు,అటు జన్మ నిచ్చిన సులోచనమ్మని, మెట్టింటి లోనూ సముచిత స్థానం పొందింది కాబట్టే అత్తమ్మ ఆండాళుదేవిని ఇద్దరమ్మలంటూ ఈ సంచీలోని దీపాన్ని అంకితమివ్వడంలోనే హిమజ లోని చల్లని మనస్తత్వం ప్రస్ఫుటమవుతుంది. ప్రోజ్ పొయిట్రీ ఫోరమ్, హైదరాబాద్ వారు ఈ మధ్యనే డిసెంబరు 2014 లో వెలువరించారు.

'అందని లోతు' కవితలో యెంతో నిశిత పరిశీలనతో ప్రపంచానికి మనసుకి సంబంధాన్ని సమతుల్యతా దృక్పథంతో ఎన్నో రహస్యాలున్నాయంటారు. తడిబట్టను పిండినట్టు, హృదయాన్ని మెలిపెడ్తున్న అభావాన్ని, ఆమూర్తాన్ని 'అగోచరమ'నే కైతలో ఆవిష్కరించారు. పైగా అవి ముసుర్కున్న మబ్బులా,
అక్షరాలను తడిపేసిన సమయంలో కవిత్వం తన చేతులతో కన్నీటిని తుడిచి మనసుకు స్వాంతన చేకూరుస్తుందట. ఎంత చక్కటి భావ చిత్రమో! సహజంగా ఎవరికైనా సొంత వూరి మీద మమకారమెక్కువ ఉంటుంది. అది సహజం అందుకే అమ్మ ఊరుగా పేర్కొనటంద్వారా వూరిలోని తన పుట్టింటికి
అమ్మ హోదా నిచ్చిన కవితాపుత్రిక హిమజ.
బాల్యపు ఆటలు, పరిసరాల స్మృతులు ఎన్నో పెనవేసుకోటం, గుర్తుకు తెచుకుని ఆ స్మృతులకు కవితా రూపమివ్వటం స్మృతి పద్యం కోవకు చేరుంతుంది.అలమర అనే కవిత దాని సొరుగులు గురించి తెరవని సొరుగుల్లో పేరుకున్న మాలిన్యం గురించి మన అలమారలను గురుతు తేవటం కవిత్వ లక్షణమే. ' యిరుకు గొడుగు' , ' ఉగాది హామీ' లతో పాటుగా.. మరో కవితలో మనిషి సమస్యల నుండి పలాయించడాన్ని ప్రస్ఫుటించేల్లా '' ఎక్కడికి పోతాం ! '' అంటూ దేవులాటను చక్కగా వ్యక్త పరుస్తుంది ఈ కవయిత్రి. '' ఓ గుండె కోసం '' అంటూనే, వెతుకులాటతో '' హృదయమెక్కడున్నదీ '' అనే ప్రశ్నను సంధించటం చక్కగా నప్పింది వరుస క్రమానికి.

మరొక కవితలో '' స్థలాలు, బంగ్లాలు, షేర్లు, కార్లు, ఏసీలు '' అంటూ ఓ లిస్టు పేర్చటమే కాదు
ఓ నాలుగు అడుగులుఒకేగమ్యంగా సాగే ఉదయపు నడక, వెచ్చటి టీకప్పులోంచి వంచుకుని
గుటక వేసే తేనీటి చుక్కలు'' - 'చాలవా!' అనేకవిత మనలనే పలుకరించినట్లుంటుంది.
అంధుల జీవనచక్రంలోని ఆటుపోట్లు, అలజడులు మనముందు పరుస్తూ '' డైలాగ్ ఇన్ ది డార్క్ '' అనే
కవిత మన మదిలో కొంత ఆర్ద్రత కలిగిస్తుంది. 'తెల్లవారినిద్ర', 'దగ్గరి దారి', 'నిరీక్షణ', 'నిమిత్త మాత్రం',
నాలుగు లైన్ల రహాదారి ' , శీర్షికలు ఒక క్రమంలో పేర్చటం యాదృచ్ఛికమో, లేక కావాలనే
అవంతట అవే పెరేడ్ చేసాయో కాని లింక్ మాత్రం తప్పనిసరిగా కలిగివున్నాయనిపిస్తుంది.
''పల్లె తల్లి గుండె సప్పుడు '' చక్కటి తెలంగాణా స్థానికత వుట్టిపడేలా మనలందరిని ఆకట్టుకుంటుంది.
చివర్లో కవితా పాదం గమనిస్తే '' పట్నం తల్లె పేగులు /మిమ్ముల తర్లిరమ్మని / తండ్లాడుతున్న సప్పుల్లే/
పిల్లలు కోడలు నువ్వు/పయిలంగుండుండ్రి, బిడ్డా! '' కండ్ల నీరెట్టి పల్లెతల్లి అగుబడ్తతంటే ఏ మాత్రం
అతిశయోక్తి కాదు. ఫెర్రీలో ఎలిఫెంటాకి అనే కవిత ఒక ప్రయాణ అనుభవం! మరో కవిత
''పురానా సామాన్వాలా'' పాత సామాన్లు కొంటాం! అనే వ్యాపార ప్రకటనలో మారకమయ్యే
వస్తువుల క్రయ విక్రయాల సందడి, పాత వాటిని వదిలించుకే తంటాలు, బేరాలు, కళ్ళముందు
నాట్యమాడతాయి. మధ్యతరగతి యవనిక ఆవిష్కరించబడుతుందీ కవితలో.
దానికి కొనసాగింపుఅన్నట్లు '' మంచి చౌక బేరం '' కవిత, '' భారం '' మరొక కవిత మరొక '' ముద్రలు '' మన మీద వేస్తాయి.చారిత్రక ప్రదేశమైన కర్నూలు జిల్లా లోని నంద్యాల పక్కన '' మహానంది '' కోనేటి వర్ణన ఆకట్టుకుంటుందికోనేటిలో పడిన చిన్న గుండుసూది కూడ ఎంత సష్టంగా కంటికి అగబడుతుందో మహానందిలో కోనేరుఆవిష్కరిస్తుంది. మేడారం జాతర, విశ్వ మానవి, వాడో ప్రశ్నార్థకం, వాఘా బోర్డర్ రిట్రీట్ పరేడ్,క్యాట్ వాక్ చేసినట్లుంటాయి. ఆసాంతం చదివిస్తాయి.
ఇదుగో ఇదే వరుసలో తదుపరి శీర్షికగానున్న ' సంచీలో దీపం ' మనకు దారిచూపిస్తుంది. '' తోబుట్టువుల నడుమ నిలిచిన మమతల వంతెనఅప్పుడే కూలిపోయిందనుకోకు '' అనే పదాలు అనుబంధాల వారధిగా మను స్ఫురిస్తాయి.'సంధికాలానికి', 'స్వప్న శకలం చేరి', 'అనునయగీతమై', దారి దీపంలా మనకు వెలుగునిస్తూ, సరికొత్త నిర్వచనం చేస్తూ, ఓ వీధిమలుపు తిప్పి, దానిని ఒక ప్రయాణపు పాటగా మార్చి , ప్రయాణంలో ప్రవహిస్తామని, పదునెక్కుతామని, మొలకెత్తుతామని, సరికొత్త నిర్వచనమందించిన హిమజ కవిత్వం అభినందనీయమూ, సర్వదా ప్రోత్సాహనీయం కూడ.
అనురక్తి, కీప్ హాంగింగ్, వరుస తదుపరి '' కొన్ని గాయాల గుర్తులెక్కడా దొరకవు, కచ్చగా గుచ్చిన కత్తి జాడ, కారిన నెత్తుటి మరకల ఆనవాలు ఎక్కడా వుండదు '' అంటూ కొన్ని గాయాలనే కవితలో పదచిత్రాలతో అలరించే కవిత కంటి తేమను తుడుచు కోమనేలా వుంది. 'దొంగాట'ను, 'గమనా'న్ని, 'గుములుబండి' తో జతపట్టించి ' కోటు ధోతీ 'ని కట్టించి, ' బతుకు అమ్మ ' అంటూనే ' దేహీ ప్రియా ' కోరికతో ' శ్రియూ పండు ' అందించి సంచీలో దీపం కవితా సంకలం మనముందుకు తెచ్చిన హింహను అమంసారా అభినందిసూ, మరెన్నో కవితా సంపుటాలను వెలువరించాలని మనసారా కోరుకుంటాను.
- కపిల రామకుమార్
(సంచీలో దీపం పుస్తకానికి హిమజ ఈ నెల 10వ తేదీన రొట్టమాకు రేవు అవార్డును అందుకుంటున్న సందర్భంగా)












Click it and Unblock the Notifications