శ్రద్ధగల విమర్శల సంకలనం

Themmeti Raghotham reddy
పుస్తకం: ఒక కథకుడు - నూరుగురు విమర్శకులు
జానర్: నాన్ ఫిక్షన్/ తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథలా చర్చా సర్వస్వం
విషయం: ఇదే సమీక్షల పుస్తకం కాబట్టి, దీన్ని సమీక్షించడం కాని పని. అందుకే ఇదేమిటో చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణా నేపథ్యంగా తెలుగు కథను వెలిగించిన వారు తుమ్మేటి రఘోత్తమరెడ్డి. సదాశివ లాంటి వాళ్లు ‘వ్యాకరణ దోషమున్న పేరు' ఇదని ప్రేమగా పలక నిరాకరించినప్పటికీ (రఘూత్తమ రెడ్డి ఉండాలంటారు పెద్దాయన!), ఆయన పేరులోనే తప్ప, కథ నిర్మాణంలో దోష రహిత స్థితిని సాధించారు. ‘అనేక కంఠాల అంతర్గత సంఘర్షణల నుంచి ఒక స్వరం ప్రాధాన్యత సంతరించుకొని, రచయిత స్వరంతో సంగమించే డైలాజిక్ స్టోరీస్' రఘోత్తముడివంటారు వల్లంపాటి వెంకటసుబ్బయ్య. పై వాక్యానికి సాక్ష్యంగా తుమ్మేటి రాసిన ‘ఉరి', ‘చావు విందు', ‘జాడ', ‘పని పిల్ల', ‘హంతకులు' కథల్ని చూపెడతారు. 1987 నాటి ‘నల్ల వజ్రం' నవలను కూడా వాస్తవ జీవితంతో దృక్పథాన్ని మేళవించిన గొప్ప నవలగా అభివర్ణిస్తారు.

జీవితానికీ, రచనా వ్యాసంగానికీ సంధి కుదుర్చుకునే ప్రయత్నంలో ఈ రచయిత రాయడం మానేసినప్పటికీ, తన ప్రయోగ శీలతతో తెలుగులో తొలి వీడియో మౌఖిక కథలు అందించారు. ‘జీవించు-నేర్చుకో-అందించు' కొటేషన్స్ పుస్తకం తెచ్చారు. మౌఖికం నుంచి లిఖిత రూపంలోకి మారిన ‘సెజ్' కథ మీద చాలా చర్చ జరిగింది. ‘ఎవరీ పని పిల్ల?' అంటూ పుస్తకం వచ్చింది. ఇతర విమర్శలు సరేసరి! ఇందులో రచయితను గుండెల్లో పెట్టుకున్నవాళ్లున్నారు; సంశయించకుండా స్త్రీవాద వ్యతిరేకి అన్నవాళ్లున్నారు; పాలకవర్గాలకు దగ్గరైన వాడిగా అభివర్ణించిన వాళ్లున్నారు. నూటా ఇరవై మంది విమర్శకుల అభిప్రాయాలన్నింటీన ఖాతరు చేస్తూ, గొప్ప సంయమనంతో ఒక చోటకు చేర్చారు రచయిత. వాటిని జాగ్రత్త పరచడం రచయిత శ్రద్దను తెలియజేస్తుంది.

‘'తొండలు గ్రుడ్లు పెట్టే భూమి''కి ఎకరానికి మూడు లక్షలు ఇవ్వడమూ, ఆ నష్ట పరిహారాన్ని తీసుకోవద్దని ప్రజలకు ‘ప్రొఫెసర్లూ, జర్నలిస్టులూ' చెప్పడమూ- ఇదంతా కథకుని కల్పనా సామర్థ్యానికి ఉదాహరణే కానీ వాస్తవానికి ఏ మాత్రం దగ్గర లేదు. ఒక వేళ అటువంటి సెచ్ ఒకటి కథకుడి దృష్టికి వచ్చినా దానినాధారం చేసుకొని సెజ్ వ్యతిరేక పోరాటాలను అవహేళన చేయడం ప్రగతి శీల దృక్పథం కాదు'' అన్నారు కొత్తపల్లి రవిబాబు.

‘‘మనకున్న అపారమైన ప్రేమ వల్ల భూమి నిలబడదు. రైతాంగానికి కూడు పెడుతున్నదా? ఉరితాటికి తలొగ్గమంటున్నదా? అన్న దగ్గరే భూమి ఏమైపోవాలన్న నిర్ణయం జరుగుతుంది. మన జీవితంలో గుర్తింప నిరాకరించే విలువను, వాస్తవాన్ని అవతలివాడిలో వెతకడం సులభం, సరదా మాత్రమే కాదు, మనకు మరింత కీర్తి తెచ్చి పెడుతుంది,'' అన్నారు ప్రశాంత్.

ఈ రెండింట్లో దేన్ని స్వీకరించాలనే స్వతంత్రం పాఠకుడికి ఎప్పుడూ ఉంటుంది. రచయితను ఇంతకుముందు చదవకపోతే కొత్తగా చదవడానికీ, ఇది వరకే చదివివుంటే తను వదిలేసిన ఖాళీల్ని పూరించుకుంటూ కొత్తగా బేరీజు వేసుకోవడానికీ సంకలనం అవకాశం కలిగిస్తుంది.

పేజీలు: 576; వెల: 400
ప్రతులకు: పాలపిట్ట బుక్స్, ప్లాట్ నెం. 3, బ్లాక్-6, ఎంఐజి-2, ఎపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-44, ఫోన్: 040-27678430.

-రాజిరెడ్డి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+