బుకర్ ప్రైజ్ రేస్లో భారత సంతతి రచయిత
లండన్: భారత సంతతి బ్రిటిష్ రచయిత నీల్ ముఖర్జీ తాజా నవల ద లైఫ్స్ ఆఫ్ అదర్స్ ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ బహుమతి-2014కి సంబంధఇంచిన తుది జాబితాకు ఎంపికైంది. ఇబ్బందుల్లో ఉన్న ఒక బెంగాల్ కుటుంబ కథను ఇతివృత్తంగా తీసుకొని ఆయన ఈ నవలను రాశారు.
ఇందులో 1960ల నాటి పరిస్థితులను కళ్లకు కట్టారు. బుకర్ ప్రైజ్ను అందుకునే అవకాశాన్ని తొలిసారిగా జాతీయత పట్టింపుల్లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషులో రచనలు చేసిన వారికి కల్పిస్తున్నారు.
నీల్ ముఖర్జీ కోల్కతాలో జన్మించారు. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. టైమ్స్, సండే టెలిగ్రాఫ్లో కాల్పనిక సాహిత్యాన్ని సమీక్షిస్తుంటారు. ఇప్పుడు ఆయన బ్రిటిష్ పౌరుడిగా ఉన్నారు. ఇది ఆయనకు రెండో రచన. మొదటి నవల 'ఎ లైఫ్ అపార్ట్' భారత్లో వొడా ఫోన్ క్రాస్ వర్డ్ అవార్డుకు ఎంపికైంది.
ఈ నేపథ్యంలో ఈసారి తుది జాబితా కింద ఆరు రచనలను ఎంపిక చేశామని, ఈ అసాధారణ పుస్తకాలు పాఠకుడిని యూకే, న్యూయార్క్, థాయ్లాండ్, ఇటలీ, కలకత్తాలకు తీసుకు వెళ్తాయని, అలాగే భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లోకి నడిపిస్తాయని ఎంపిక కమిటీ చైర్ పర్సన్ ఏసీ గ్రేలింగ్ తెలిపారు.
కాగా, తుది జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో అమెరికాకు చెందిన జాషువా ఫెరిస్ (టు రైజ్ అగైన్ ఎట్ ఏ డీసెంట్), క్యారెన్ జాయ్ పౌలర్ (వుయ్ ఆర్ ఆల్ కంప్లీట్లీ బిసైడ్ అవర్ సెల్వ్స్), ఆస్ట్రేలియాకు చెందిన రిచర్డ్ ప్లానాగన్ (ది నేరో రోడ్ టు ద డీప్ నార్త్), బ్రిటన్కు చెందిన హోవర్డ్ జాకబ్ సన్ (జే), అలీ స్మిత్ (హౌ ట బి బోత్) ఉన్నాయి.