కవిస్వరం: కొత్త ఆవిష్కరణ
అంతర్మథనాన్ని, అంతర్లోకాలను వ్యక్తీకరించే కవిత ఎప్పుడైనా బాగుంటుంది. పుష్యమి సాగర్ ఈ వారం అటువంటి కవితను ఓదాన్ని అందించాడు. అమూర్త భాననలకు మూర్త ప్రతీకలను కల్పించడం ద్వారా కవిత సౌందర్యాన్ని సంతరించుకుంటుంది. అటువంటి అందాన్నే పుష్యమి సాగర్ కొత్త ఆవిష్కరణ కవిత పొందింది. నిజానికి, కవి, సృజనాత్మర రచయిత ఎవరైనా సరే, ఆవిష్కరణ చేసే సందర్భంలో తప్పకుండా జ్ఞాన సంపదకు సంపదకు సంబంధించిన భారాన్నంతా దించేయాలి. ఏమీ తెలియని అన్వేషిలా మారాలి. లెర్నింగ్ నుంచి అన్ లెర్నింగ్లోకి ముడుచుకోవాలి.
పుష్యమీ సాగర్ ఈ కవితలో అది చేయడమే కాకుండా, ఆ విషయాన్ని తెలిసో తెలియకో వ్యక్తీకరించాడు. "అజ్ఝానపు నదిలో ఎంత సేపు ఈదినా/ దరి చేరక/ వొడ్డున పడ్డ చేపలా/ గిలగిలలాడుతుంటాను అని అతను అంటాడు. ఆ తండ్లాట, ఆ వేదన కవిత్వ రూపం ధరించి, సౌందర్య పరీమళాన్ని గుప్పిస్తుంది. నిజానికి ఒడ్డున పడడమంటే సమస్యల నుంచి బయటపడినట్లు.. కానీ చేప పిల్ల ఒడ్డున పడ్డట్లు అంటే ప్రాణవాయువు లేక కొట్టుకుంటున్నట్లు లెక్క. కవి ఒడ్డునే ఉన్నా చేప పిల్లలాంటివాడని అని చెప్పకనే చెప్పాడు కవి.

అయితే, కీర్తికండూతీ మీద పుష్యమీ సాగర్ ఓ విసురు విసిరినట్లే ఉన్నాడు. తనలోని అపసవ్యపు ఆలోచనలను దూరం చేసుకోవాలని చెబుతున్నప్పటికీ అది అందరికి సంబంధించిన విషయం కావడం విశేషం. అయితే, చివరి పంక్తిలో మాత్రం కాస్తా సర్దుబాటు చేస్తే బాగుండేదనిపించింది. "ఎన్నిసార్లయినా పుడుతాను... చస్తాను" అని అన్నాడు. ఎన్నిసార్లయినా చస్తాను... మళ్లీ పుడుతాను అంటే అర్థయుక్తంగా ఉండేదేమో అనిపించింది. పాతిపెట్టిన శవం, విత్తనమై మొలుకెత్తుతుంది. అది కవికి సంబంధించి దాన్ని కాల్పనిక వాస్తవికతగా తీసుకోవాలి. అతిశయోక్తుల నుంచి కవి వాస్తవికతను ఆవిష్కరిస్తాడు.
అయితే, పూర్తిగా పుష్యమి సాగర్ అపారలౌకకిమేమీ లేదు, భౌతిక విషయాల నుంచి అలౌకికంలోకి ప్రయాణించినట్లు అనిపిస్తాడు. అసూయ మంటల్లో అలోచనలను తగులబెట్టుకోవడం, కొన్ని గెలుపు రాళ్లను దాటేసుకుని విర్రవీగడం వంటివి భౌతికపరమైన మనిషి ఆలోచనలకు సంబంధించిన విషయాలు. వాటి నుంచి కవి సృజనాత్మకత పీక నొక్కేసినప్పుడు మాత్రం ఒంటరితనపు దూలానికి ఉరి తీయబడ్డ అపరాధ ప్రతీకను అని తనను తాను ఆవిష్కరించుకుంటూనే కవి కర్తవ్యాన్ని కూడా సూచించాడు పుష్యమి సాగర్.
- కాసుల ప్రతాపరెడ్డి
పిల్లన గ్రోవిలో గాలిలా
నా లోపలి ప్రపంచపు ద్వారాలను
తెగ తెంచుకొని ఉరుకుతుంటాను
తెలియనితనాన్ని
అక్షరంలో వొంచుకుందామని
అజ్ఞానం నదిలో ఎంత సేపు ఈదినా
దరి చెరక
వొడ్డున పడ్డ చేపలా
గిల గిల లాడుతుంటాను
కొన్ని గెలుపు రాళ్ళను
దాటేసుకొని విర్రవీగుతూ
అడ్డ దిడ్డంగా ఎగుడు దిగుడు దారుల్ల్లో
పడి సంచరిస్తున్నప్పుడు
ఓటమి తుఫాను ధాటికి
చిల్లుపడ్డ మేఘపు వర్షపు చుక్కను
అసూయ మంటలలో
ఆలోచనలను తగలబెట్టుకొని
సృజనాత్మకత పీక నోక్కేసినప్పుడు
ఒంటరితనపు దూలానికి ఉరి తీయబడ్డ
అపరాధభావ ప్రతీకను
లోకంతో పుస్తకాన్ని చుట్టాల్సిన నేను
గడియారంలో లోలకంలా
నాతో నేను, నాలో నేను నిరంతరం
కీర్తికై నలుగురిలో పతాక శీర్షికలా
జెండాపై కపిరాజును నేనే...
నన్ను నేను జయించేవరకు
ఎన్ని సార్లు అయినా పుడుతాను ...చస్తాను !!
- పుష్యమి సాగర్
16 జనవరి 2015












Click it and Unblock the Notifications