కవి స్వరం: కట్టా శ్రీనివాస్ కవిత
కవిసంగమంలోని బలమైన కవుల్లో కట్టా శ్రీనివాస్ ఒక్కరు. కొంత మార్మికత, కొత్త ప్రతీకలు ఆయన కవితల్లో కనిపిస్తాయి. ప్రస్తుతం తిప్పరదండం కవితలో కూడా అది కనిపిస్తోంది. కాస్తా వ్యక్తిగతం, కాస్తా రాజకీయమూ కలగలిసి సమాజంలోని తలకిందుల విలువను కట్టా శ్రీనివాస్ ఈ కవితలో ప్రశ్నిస్తాడు లేదా నిందిస్తున్నాడు.
అసలు తిప్పరదండం అంటే ఏమిటో చాలా మందికి తెలియక పోవచ్చు. పాత కాలంలో, అంటే తెలంగాణలో అయితే నిజాం ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో కాన్గీ బడులు ఉండేవి. వాటిలో విద్యార్థులకు వేసే శిక్షలు మహా దారుణంగా ఉండేవి. బెత్తంతో కొట్టడమే కాదు, మొద్దు రాచిప్పలను కోదండం వేయించేవారు, గోడ కుర్చీ వేయించేవారు.

తిప్పరదండమూ ఉండేది. విద్యార్థిని తలకిందులుగా దూలానికి వేలాడదీసి, కింద కంప పెట్టేవారు. అది విద్యార్థికి వేసే గరిష్ట శిక్ష. దాంతో పిల్లలు కాన్గీ బడి అంటే భయంతో వణికిపోయేవారు. ఇప్పుడు రాజకీయమూ, ఆధిపత్య వర్గాలు చెలామణిలోకి తెస్తున్న విలువలు సమాజాన్ని తలకిందులుగా వేలాదదీస్తున్నాయి. మొదటి స్టాంజాలో ఈ విషయాన్ని కట్టా శ్రీనివాస్ వివరించారు. దానికి ముగింపుగా రెండో స్టాంజా రాశారు.
నిజానికి, మొదటి స్టాంజాతో కవిత అయిపోయినట్లు కనిపిస్తుంది. అయిపోయింది కూడా. కానీ, దాంతోనే ఆపేస్తే పరిస్థితిని మాత్రమే వివరించినట్లు ఉంటుంది. రెండో స్టాంజాలో తలకిందుల సమాజం పట్ల సున్నితంగానే అయినా ధిక్కారం ప్రకటించే తత్వాన్ని చెప్పాడు కట్టా శ్రీనివాస్. ఆ రకంగా కవితకు ప్రయోజనాన్ని చేకూర్చారు.
- కాసుల ప్రతాపరెడ్డి
తిప్పరదండం
ఉక్కుగోళ్ళ లోహపు పక్షి ఒకటి
ముక్కుతో పొడుస్తూ
తెగతిడుతోంది.
సజీవ శిలాజంలా
మిగిలున్న ఓ పిచ్చిపిట్టని
వెధవపక్షీ!
ఎప్పుడూ ఎందుకిలా
మెత్తగా వుంటావంటూ
లేబుల్ సీసాలోని నీళ్ళు
ఎగిరెగిరి మిడిసిపడుతూ
మూగనదిని ఆడిపోసుకుంటున్నాయి.
పిచ్చిమొహమా !!
కొంచెం నాగరికత నేర్వరాదే అంటూ.
...
వెనకగదిలోని
అమ్మకాలం నాటి నిర్మలత్వంలాగానే
అవికూడా మౌనాన్నే సమాధానమిస్తున్నాయి.
- కట్టా శ్రీనివాస్
23-03-2014
కవిసంగమం గ్రూప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications