నేడు పాక్షిక చంద్ర గ్రహణం: కనిపించే దేశాలు ఇవే- మళ్లీ 2029 లోనే
ఖగోళ ప్రియులకు ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. నేడు పాక్షిక చంద్రగ్రహణం సంభవించబోతోంది. దాదాపు 96 శాతం చంద్రుడిని భూఛాయ కమ్మేయనుంది. మిగిలిన ఆ భాగం మాత్రమే సూర్యకాంతితో వెలుగుతూ కనిపిస్తుంది. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశించనున్నాడు. రెడ్ మూన్ గా కనువిందు చేయనున్నాడు. ఈ నెలలో వచ్చే పున్నమి చంద్రుడిని స్టర్జన్ మూన్ అని పిలుస్తారు.
భారత్ లో ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని నేరుగా వీక్షించే అవకాశం లేదు. చంద్రగ్రహణ సమయం పగలు కావడమే ఇందుకు కారణం. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 8:03 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమౌతుంది. సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగుతుంది. 9:42 నిమిషాలకు గ్రహణం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఆ సమయంలో చంద్రుడి శోభ అత్యంత ఆకర్షణీయంగా మారుతుంది.

ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని పశ్చిమ యూరప్ దేశాలు.. స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లో కొన్ని ప్రాంతాల ప్రజలు కూడా దీనిని వీక్షించవచ్చు. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా ఈ గ్రహణం కనిపిస్తుంది. గ్రహణ సమయం నాటికి భారత్తో పాటు ఇతర ఆసియా దేశాల్లో సూర్యుడు ఉదయించి ఉండటం వల్ల చంద్రుడు కనిపించడు.
పశ్చిమ ఐరోపా ప్రాంతాల్లో ఈ గ్రహణ గరిష్ట సమయం సూర్యోదయానికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఆ సమయంలో చంద్రుడు పశ్చిమ దిశగా ఆకాశంలో దాదాపుగా భూమికి సమాంతరంగా కనిపిస్తాడు. ఉదయించే సూర్యుడి కాంతి చంద్రుడిపై పడుతుంది. భూ వాతావరణం ఓ ఫిల్టర్ లాగా చంద్రుడిపైకి ఎరుపు రంగు కాంతిని మాత్రమే ప్రసరింపజేస్తుంది. దీనివల్లనే గ్రహణ సమయంలో చంద్రబింబం అత్యంత ఆకర్షణీయంగా ఎరుపు- గోధుమ రంగుల్లో ఓ నూతన అనుభూతిని ఇస్తుంది. బ్లడ్ మూన్ గా పిలవడానికి కారణం ఇదే.
ఇటువంటి చంద్రగ్రహణం 2029 వరకు కనిపించదు. ఆ ఏడాది జూన్ లో చంద్రుడు ఎరుపు రంగులోకి మారే బ్లడ్ మూన్ ఎక్లిప్స్ సంభవిస్తుందని నాసా తెలిపింది. ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ఏర్పాట్లు చేసిందీ సంస్థ.












Click it and Unblock the Notifications