125 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనంత వేడి. రికార్డు సృష్టించిన ఆగస్టు!
గతంలో ఎన్నడూ లేని విధంగా భూగోళం ఊహించని రీతిలో వేడెక్కిపోతోంది. వాతావరణ మార్పుల తీవ్రత రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుతోందని స్పష్టం చేస్తూ ఐరోపా సమాఖ్యకు చెందిన 'కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్' ఒక షాకింగ్ నివేదికను విడుదల చేసింది. ప్రపంచ వాతావరణ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా 2026 ఆగస్టు సరికొత్త రికార్డు సృష్టించింది. 2023 జులై నెలలో నమోదైన ఆల్టైమ్ హై రికార్డును ఈ ఆగస్టు సమం చేసిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
పారిశ్రామిక విప్లవానికి ముందు (1850-1900) ఉన్న సగటు ఉష్ణోగ్రతల కంటే ఈ ఏడాది ఆగస్టులో ఏకంగా 1.65 డిగ్రీల సెల్సియస్ అదనపు వేడి నమోదైంది. గత ఏడాది నవంబర్ తర్వాత ప్రపంచ సగటు ఉష్ణోగ్రత మళ్లీ 1.5 డిగ్రీల పరిమితిని దాటడం ఇదే తొలిసారి. అంతేకాకుండా, ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు గడిచిన మూడు నెలల కాలం... భూగోళంపై నమోదైన అత్యంత ఉష్ణోగ్రత కలిగిన కాలంగా రికార్డుకెక్కింది. వాతావరణంలో జరుగుతున్న ఈ మార్పులు భవిష్యత్తులో రాబోయే పెను ముప్పునకు పక్కా నిదర్శనమని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పారిస్ ఒప్పందం పరిమితికి చేరిందా?
ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల మేర పెరిగినప్పటికీ, సాంకేతికంగా ఇది పారిస్ వాతావరణ ఒప్పందం గీసిన గీతను పూర్తిగా దాటినట్లు కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. పారిస్ ఒప్పందం అనేది కేవలం ఒక నెల లేదా ఏడాది గణాంకాల ఆధారంగా కాకుండా... కొన్ని దశాబ్దాల పాటు నమోదయ్యే దీర్ఘకాలిక సగటును పరిగణనలోకి తీసుకుంటుంది. భూగోళ ఉష్ణోగ్రతల పెంపును 2 డిగ్రీల కంటే తక్కువకు, వీలైతే 1.5 డిగ్రీల లోపే నియంత్రించాలని ఈ ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ స్థాయిలో వేడి పెరగడం పర్యావరణ వ్యవస్థ పతనానికి ముందస్తు హెచ్చరికేనని నిపుణులు చెబుతున్నారు.
కరిగిపోతున్న మంచు.. కుప్పకూలుతున్న వ్యవస్థలు!
భూమి ఇలా మండిపోతుండటం వల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచు వేగంగా కరిగిపోతోంది. సముద్ర మట్టాలు పెరగడం, అకాల వర్షాలు, అతివృష్టి, తీవ్రమైన కరువు వంటి విపరీతమైన వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడుతున్నాయి. బొగ్గు, పెట్రోల్, గ్యాస్ వంటి ఇంధనాలను అమితంగా వాడటం వల్ల వాతావరణం కలుషితమై భూమి వెచ్చబడుతోందని ఐక్యరాజ్యసమితి క్లైమేట్ ఛేంజ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ సైమన్ స్టీల్ హెచ్చరించారు. కాలుష్యానికి అడ్డుకట్ట వేయకపోతే ఈ వేడిగాలులు కోట్లాది మంది ప్రాణాలను బలితీసుకోవడమే కాకుండా, రవాణా, వైద్య రంగాలను దెబ్బతీసి నిత్యావసరాల ధరలను ఆకాశానికి ఎత్తివేస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భారత్లోనూ వంద ఏళ్ల రికార్డు బద్దలు!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ వేడి గాలుల ప్రభావం భారత్పై కూడా తీవ్రంగా పడింది. 1901 నుంచి ఇప్పటివరకు మన దేశంలో నమోదైన ఆగస్టు నెలల్లో... 2026 ఆగస్టులోనే అత్యధిక సగటు ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెలలో దేశంలో సగటున 28.01 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై సరికొత్త రికార్డును నమోదు చేసింది. భానుడి భగభగలతో భావితరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుండటంతో ఇప్పటికైనా ప్రపంచ దేశాలు పర్యావరణ పరిరక్షణపై తక్షణ చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.














Click it and Unblock the Notifications
