మహ్మద్ సిరాజ్కు జూబ్లీహిల్స్లో ఇంటి స్థలం కేటాయింపు
హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. జూబ్లీహిల్స్లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని భారత క్రికెట్ జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్కు చెందిన స్టార్ బౌలర్ సిరాజ్ కూడా ఈ ట్రోఫీని గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే టైటిల్ గెలచుకుని స్వదేశానికి వచ్చిన సిరాజ్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు టీమిండియా జెర్సీని కూడా బహూకరించారు. అంతర్జాతీయ క్రికెట్ లో భారతదేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

ఈ క్రమంలోనే సిరాజ్కు ఇంటి స్థలం, ప్రభుత్వ (గ్రూప్ 1) ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిరాజ్ కు తాజాగా ఇంటి స్థలం కేటాయిస్తూ జీవో జారీ చేసింది. టీమిండియాలో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడు మహ్మద్ సిరాజ్ కావడం గమనార్హం.
కాగా, ప్రపంచ కప్ టోర్నీలో సిరాజ్ గ్రూప్ స్టేజ్ వరకు మాత్రమే తుది జట్టులో కొనసాగాడు. విండీస్ పిచెస్ స్పిన్కు అనుకూలంగా ఉండటంతో సిరాజ్ కు చోటు దక్కలేదు. అయితే, దాయాది పాకిస్థాన్పై భారత్ విజయం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. టీ ప్రపంచ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించిన టీమిండియా టోర్నీని సొంతం చేసుకుంది. 2007 తర్వాత రోహిత్ శర్మ నాయకత్వంలో మరోసారి టీ20 వరల్డ్ కంప్ను భారత్ గెలుచుకుంది.












Click it and Unblock the Notifications