సూర్యకుమార్ కు ఎర్త్- కేప్టెన్ గా ది గ్రేట్ డెస్ట్రాయర్?
ఐపీఎల్ 2026 సీజన్లో తొలి విజయం తర్వాత ముంబై ఇండియన్స్ గెలుపు ట్రాక్ తప్పింది. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గురువారం పంజాబ్ కింగ్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇది వారికి వరుసగా నాలుగో ఓటమి. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (60 బంతుల్లో 112 పరుగులు నాటౌట్) అద్భుత శతకం సాధించినా, జట్టు విజయం సాధించలేకపోయింది.
కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టాప్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మలు వరుసగా విఫలమౌతోన్నారు. దీంతో వారిని పక్కన పెట్టాలనే వాదనలు బలంగా వినిపిస్తోన్నాయి. టీమిండియా టీ20 కేప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యకుమార్ యాదవ్ ను తప్పించాలని కోరుతున్నారు. తిలక్ వర్మ, బుమ్రాలపైనా వేటు వేయాలని సూచిస్తోన్నారు. వారి స్థానంలో రజత్ పటిదార్, శ్రేయాస్ అయ్యర్ ను తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోయాడనేది స్పష్టంగా కనిపిస్తోంది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఐదు ఇన్నింగ్స్లలో కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. ఇది జట్టుకు పెద్ద సమస్యగా మారింది. అతనితో పాటు తిలక్ వర్మ కూడా పేలవ ఫామ్లో ఉన్నాడు. టీ20లలో బాగా ఆడినా, ఐపీఎల్ 2026లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్లలో 43 పరుగులు మాత్రమే చేశాడు.
ఈ మ్యాచ్ శ్రేయస్ అయ్యర్ ఆధిపత్యాన్ని స్పష్టం చేసింది. అతని సూపర్మ్యాన్ ఫీల్డింగ్ ఆకట్టుకుంది. జట్టును ముందుండి నడిపించే నాయకత్వ లక్షణాలు, బ్యాటింగ్.. పంజాబ్ కింగ్స్ కు కొత్త మలుపునిచ్చింది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ 4-0తో అగ్రస్థానానికి చేరింది. ప్రస్తుతం శుభ్మన్ గిల్ వన్డే, టెస్టులు, సూర్యకుమార్ యాదవ్ టీ20లకు కెప్టెన్లుగా ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో అయ్యర్ కేప్టెన్ గా సత్తా చాటుతున్నాడు. 'డెస్ట్రాయర్'గా మారాడు.
సన్రైజర్స్ హైదరాబాద్పై 33 బంతుల్లో 69, చెన్నైపై 29 బంతుల్లో 50, ముంబైపై 35 బంతుల్లో అజేయంగా 66 పరుగులు చేశాడు. ఒత్తిడితో పాటు పెద్ద మ్యాచ్లను అలవోకగా ఎదుర్కొనగలనని నిరూపించాడు. ఈ సీజన్లో అతని స్ట్రైక్ రేట్ 188.57, సగటు 67.66. ఐదు మ్యాచ్ల నాలుగు ఇన్నింగ్స్లలో 203 పరుగులు చేసి, 187.96 స్ట్రైక్ రేట్తో ప్రమాదకర బ్యాట్స్మెన్గా నిలిచాడు. గత మూడేళ్లలో నిరంతర విజయాలు సాధిస్తూ వస్తోన్నాడు శ్రేయాస్ అయ్యర్.
2024లో కోల్కతా నైట్ రైడర్స్ను ఐపీఎల్ ఛాంపియన్గా, 2025లో పంజాబ్ కింగ్స్ను ఫైనల్కు చేర్చాడు. దేశీయ క్రికెట్లోనూ ముంబైకి సయ్యద్ ముస్తాక్ అలీ, రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలలోనూ అతని పాత్ర కీలకమైనది. అన్ని స్థాయిలలోనూ అతను ట్రోఫీలు సాధించాడు. ప్రస్తుత కెప్టెన్సీ ఎంపికలతో పోలిస్తే, అయ్యర్ రికార్డు మరింత పటిష్టం. ఐపీఎల్లో కెప్టెన్గా ఒక్క ట్రోఫీ కూడా గెలవని సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ల కంటే అయ్యర్ ఒక టైటిల్, మూడు ఫైనల్స్కు నాయకత్వం వహించాడు.
ఢిల్లీ కేపిటల్స్, కోల్ కత నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా అయ్యర్ 92 మ్యాచ్లలో 54 విజయాలు అందుకున్నాడు. 35 ఓటములు, మూడు ఫలితం తేలని మ్యాచ్ల రికార్డు అతనికి ఉంది. శుభ్మన్ గిల్ గుజరాత్ టైటాన్స్కు 30 మ్యాచ్లలో సారథ్యం వహించి 16 విజయాలు, 14 ఓటములు నమోదు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్కు 3 మ్యాచ్లలో కెప్టెన్గా చేసి ఒక విజయం, రెండు ఓటములు మాత్రమే సాధించాడు.












Click it and Unblock the Notifications