మంత్రిగా మాజీ క్రికెటర్!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా మాజీ పేసర్ అశోక్ దిండా ఆ రాష్ట్ర నూతన క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో క్రీడాకారుడిగా విశేష అనుభవం ఉన్న అశోక్ దిండాను మంత్రి పదవి వరించింది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 స్థానాలకు గాను బీజేపీ 206 సీట్లను కైవసం చేసుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ విజయ పరంపరలో దిండా మొయినా నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై తన పట్టును నిరూపించుకున్నారు.
అశోక్ దిండా రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే.. ఆయన 2021లోనే మొయినా నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అప్పట్లో బీజేపీ అధికారానికి దూరంగా ఉండటంతో ఆయన ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో నేరుగా కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ పొందారు. ఓ ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. బెంగాల్ క్రీడా శాఖ బాధ్యతలు వరుసగా ఇద్దరు క్రికెటర్లకే దక్కడం. గత తృణమూల్ ప్రభుత్వంలో మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ క్రీడా మంత్రిగా ఉండగా.. ఇప్పుడు అశోక్ దిండా ఆ బాధ్యతలను స్వీకరించారు.

ఈ మంత్రి పదవి దక్కించుకునే క్రమంలో అశోక్ దిండాకు ఇతర దిగ్గజాల నుంచి గట్టి పోటీ ఎదురైంది. డమ్ డమ్ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే సౌరవ్ సిక్దర్, మాజీ హాకీ స్టార్ భరత్ ఛెత్రి వంటి వారు ఈ రేసులో ఉన్నప్పటికీ.. అధిష్టానం అశోక్ దిండా వైపే మొగ్గు చూపింది. క్రీడా రంగంలో ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవం, గ్రౌండ్ లెవల్లో ఉన్న సమస్యలపై అవగాహన బెంగాల్ క్రీడా రంగాన్ని అభివృద్ధి బాట పట్టించడానికి దోహదపడుతుందని పార్టీ భావించింది.
అశోక్ దిండా క్రికెట్ కెరీర్ పట్ల క్రీడాభిమానులకు ప్రత్యేక గౌరవం ఉంది. 2008లో ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆయన, తనదైన శైలిలో బౌలింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. భారత్ తరపున 13 వన్డేలు, 9 టీ20లు ఆడిన ఆయన, డొమెస్టిక్ క్రికెట్లో బెంగాల్ జట్టుకు వెన్నెముకగా నిలిచారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఏకంగా 420 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటారు. 2021లో క్రికెట్కు స్వస్తి చెప్పిన దిండా, ఇప్పుడు రాజకీయ మైదానంలో క్రీడా మంత్రిగా తన రెండో ఇన్నింగ్స్ను ఘనంగా ప్రారంభించారు.












Click it and Unblock the Notifications