CSK vs MI: సీఎస్కే చేతిలో దారుణ ఓటమి అందుకే-తేల్చేసిన హార్దిక్ పాండ్యా..!
నిన్న ముంబై వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఏకంగా 103 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. పరుగుల పరంగా ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్కు ఇదే అతిపెద్ద ఓటమి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ సంజూ శాంసన్ అజేయ సెంచరీ సాయంతో 6 వికెట్లకు 207 పరుగులు చేయగా.. 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ 104 పరుగులకే ఆలౌటైంది.
ఈ మ్యాచ్ లో ఇంత దారుణంగా ఓటమి పాలవ్వడానికి కారణాల్ని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) వెల్లడించాడు. పవర్ప్లేలో జట్టుకు లభించిన పేలవమైన ఆరంభమే తమకు భారీ మూల్యం చెల్లించేలా చేసిందని హార్దిక్ అభిప్రాయపడ్డాడు. ముంబై 2.3 ఓవర్లలోనే 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. డానిష్ మలేవార్ తొలి బంతికే డకౌట్ కాగా, నమన్ ధీర్ మూడు బంతుల్లో సున్నా పరుగులు చేశాడు, క్వింటన్ డి కాక్ 7 పరుగులకే అవుటయ్యాడు. ఆ తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్లు 73 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నా.. అదీ ఎక్కువసేపు సాగలేదు.

దీనిపై స్పందించిన హార్ధిక్.. "పవర్ప్లేలో ఆరంభంలోనే వికెట్ కోల్పోవడం ఎప్పుడూ కష్టమే. మనం ఎప్పుడూ గెలుపు కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం, ఆ తర్వాత మేము నిలదొక్కుకోలేకపోయాం" అన్నాడు. రెండో ఇన్నింగ్స్ లో పిచ్ మారిందా అన్న ప్రశ్నకు హార్దిక్ లేదన్నాడు. అలా అనే రకం మనిషిని కాదన్నాడు. వాళ్ళు బాగా బ్యాటింగ్ చేశారు, 207 పరుగులు చేశారు. అది అదే పిచ్, అదే నేల. మేం కూడా బాగా బ్యాటింగ్ చేసి ఉండాల్సింది అన్నాడు. తమ స్పిన్నర్లు కూడా బాగానే బౌలింగ్ చేశారని, కాకపోతే సంజు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని తెలిపాడు. అదే సమయంలో, వారి బ్యాటర్లు నిలకడగా రాణించి, జట్టును ఒక మోస్తరు స్కోరుకు చేర్చారన్నాడు. ఆ పిచ్పై అది ఒక మోస్తరు స్కోరు కంటే ఎక్కువే అన్నాడు. తాము ఈ లక్ష్యాన్ని ఛేజ్ చేయాలంటే, పవర్ప్లేలో బాగా ఆడాల్సిందని, కానీ అలా జరగలేదన్నాడు.














Click it and Unblock the Notifications