ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్పై అలా చెప్పావేంటీ.. గిబ్స్: ఆగమై పోరూ
Champions Trophy 2025 final: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ దూకుడు కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్లల్లో జయభేరి మోగించింది. రెండు మ్యాచ్లు- రెండు విజయాలతో నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. గ్రూప్ ఏలో రెండో స్థానంలో నిలిచింది. సెమీ ఫైనల్స్కు అర్హత సాధించింది. ఈ గ్రూప్లో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్.. రేసు నుంచి తప్పుకొన్నాయి.
నూటొక్క పరుగులతో..
ఈ నెల 20వ తేదీన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది భారత్. ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్దేశించిన 228 పరుగులను 46.3 ఓవర్లలో కొట్టిఅవతల పడేసింది. శుభ్మన్ గిల్ నూటొక్క పరుగులతో చెలరేగిన గేమ్ అది.

పాకిస్తాన్కు చుక్కలు..
ఈ నెల 23వ తేదీన తన మలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్కు చుక్కలు చూపించింది టీమిండియా. ఇక్కడా ఆరు వికెట్ల తేడాతోనే జయకేతనాన్ని ఎగురవేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్దేశించిన 241 పరుగులను 42.3 ఓవర్లలోనే ఊదేసింది. టీమిండియా బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కాడీ మ్యాచ్లో.
తదుపరి మ్యాచ్లో..
ఇక తన తదుపరి మ్యాచ్లో న్యూజిలాండ్ను ఢీ కొట్టబోతోంది రోహిత్ సేన. ఈ మ్యాచ్ ఈ ఆదివారం జరుగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దీనికి వేదిక. మధ్యాహ్నం 2:30 గంటలకు గేమ్ మొదలవుతుంది. ఇప్పటికే ఈ రెండు జట్లూ కూడా సెమీ ఫైనల్స్కు అర్హత సాధించాయి. బంగ్లాదేశ్పై గెలిచిన తరువాత గ్రూప్ ఏలో అగ్రస్థానానికి ఎగబాకింది న్యూజిలాండ్.
అందరి దృష్టీ..
గ్రూప్ ఏలో తొలి రెండు అగ్రజట్ల మధ్య మ్యాచ్ కావడం వల్ల దీనిపై అందరి దృష్టీ నిలిచింది. లీగ్ దశలో భారత్-న్యూజిలాండ్ ఆడబోయే చివరి మ్యాచ్ ఇదే. దీన్నీ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి ఈ రెండు జట్లు కూడా. ఈ గేమ్తోనే లీగ్ దశ కూడా ముగుస్తుంది. మంగళవారం అంటే మార్చి 4వ తేదీన తొలి సెమీ ఫైనల్ జరుగుతుంది.
ఫైనల్స్లో గ్రాండ్గా..
సెమీ ఫైనల్స్ గండాన్ని దాటుకుంటే ఫైనల్స్లో గ్రాండ్గా అడుగు పెట్టగలుగుతుంది భారత్. ఇప్పుడున్న ఊపు చూస్తోంటే అది పెద్దగా కష్టం అనిపించట్లేదు. అందుకే- ఈ ట్రోఫీ హాట్ ఫేవరెట్గా మారింది టీమిండియా. ఫైనల్స్లో అడుగు పెట్టడం లాంఛనప్రాయమే అవుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
ఫైనల్స్లో భారత్ను ఢీ కొట్టే జట్టు..
తాజాగా దక్షిణాఫ్రికా మాజీ డాషింగ్ బ్యాటర్ హెర్షెల్ గిబ్స్ ఇదే విషయాన్ని వెల్లడించాడు. భారత్ బలీయమైన జట్టుగా ఉందని, ఫైనల్స్లో అడుగు పెడుతుందనడంలో సందేహాలు అక్కర్లేదని అన్నాడు. ఫైనల్స్లో భారత్ను ఢీ కొట్టే జట్టు దక్షిణాఫ్రికా అవుతుందని అంచనా వేశాడు గిబ్స్.
ఛాంపియన్స్ ట్రోఫీపై..
ఇండియా కార్పొరేట్ టీ20 బాష్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి భారత్ వచ్చాడు గిబ్స్. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సోనూ సూద్తో కలిసి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్పై తన అంచనాలను వెల్లడించాడు.
ఐసీసీ టోర్నమెంట్లల్లో..
ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా జట్టు మంచి పొజీషన్లో ఉందని గిబ్స్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఐసీసీ టోర్నమెంట్లల్లో తడబడే చరిత్ర దక్షిణాఫ్రికాకు ఉందని, ఆ విషయంపై తాము అప్రమత్తంగా ఉన్నామని అన్నాడు. దాన్ని సరిదిద్దుకోగలమని ధీమాగా చెప్పాడు. ఫైనల్స్లో భారత్తో దక్షిణాఫ్రికా తలపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు.
ఫైనల్స్ చేరే అర్హత..
ప్రస్తుతానికి టీమిండియా అత్యంత బలమైన జట్టుగా కనిపిస్తోందని, ఫైనల్స్ చేరే అర్హత ఉందని పేర్కొన్నాడు. వర్షం వల్ల ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడలేకపోవడం కొద్దిగా నిరాశకు గురి చేసిందని అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లాండ్.. ఆఫ్ఘనిస్తాన్ను ఓడించితే, ఆస్ట్రేలియాతో జరిగే గేమ్ నాకౌట్ అవుతుందని అభిప్రాయపడ్డాడు.












Click it and Unblock the Notifications